బీజేపీ ఆశలను అడియాశలు చేసిన ఈసీ ! మోడీ బయోపిక్కు బ్రేక్
ఢిల్లీ : మోడీ బయోపిక్ విషయంలో బీజేపీకి షాక్ తగిలింది. చిత్ర విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. నరేంద్రమోడీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోడీ చిత్రం ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రిలీజ్ చేయొద్దని స్పష్టంచేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ నాయకుల బయోపిక్లు విడుదల చేయవద్దని తేల్చి చెప్పింది.
మోడీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా: పాక్ ప్రధాని! అసలు కారణం?
మోడీ బయోపిక్కు బ్రేక్
వివేక్ ఒబేరాయ్ కథానాయకుడిగా నటించిన పీఎం నరేంద్రమోడీ చిత్రాన్ని ఏప్రిల్ 11న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అయితే దానిని ఆపాలంటూ దాఖలైన పిటీషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఈసీకి వదిలేసింది. ప్రతిపక్షాల ఫిర్యాదులను పరిశీలించిన ఎలక్షన్ కమిషన్.. సినిమా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని అభిప్రాయపడింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు చిత్రాన్ని విడుదల చేయవద్దని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏమైనా ఫిర్యాదులు ఉండే సుప్రీంకోర్టు లేదా హై కోర్టు రిటైర్డ్ జడ్జిలతో కూడిన ప్యానెల్ వాటిని పరిశీలిస్తుందని చెప్పింది.
మోడీ రాజకీయ జీవితమే ఇతివృత్తం
పీఎం నరేంద్రమోడీ చిత్రంలో ప్రధాని మోడీ రాజకీయ జీవితాన్ని చూపినట్లు తెలుస్తోంది. ఆయన గుజరాత్ సీఎం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం వరకు అన్ని కోణాలను ప్రస్తావించినట్లు సమాచారం. వాస్తవానికి ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా సెన్సార్ బోర్డు సైతం సినిమాకు యూ సర్టిఫికేట్ ఇవ్వడంతో ఏప్రిల్ 11న రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
సుప్రీంలో కాంగ్రెస్ పిటీషన్
ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ బయోపిక్ విడుదలపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చిత్రం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందంటూ అమన్ పన్వర్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. రాజకీయ లబ్ది పొందేందుకే బీజేపీ ఎన్నికల సమయంలో చిత్రాన్ని విడుదల చేస్తోందన్న అంశాన్ని ప్రస్తావించింది.
స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు
కాంగ్రెస్ ఫిర్యాదుపై మంగళవారం విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన ధర్మాసనం పిటీషన్ కొట్టివేసింది. కేవలం రెండు నిమిషాల ట్రైలర్ చూసి నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడింది. పీఎం నరేంద్రమోడీ చిత్రాన్ని పరిశీలించి సినిమా విడుదలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఈసీకి వదిలేసింది. ఇలాంటి అంశాల వల్ల కోర్టు సమయం వృథా అవుతోందని అభిప్రాయపడింది.