చైనాతో అమీతుమీ: లఢక్లో మోడీ: ముగ్గురు కీలక మంత్రులతో హైలెవెల్ భేటీకి పిలుపు: కీలక నిర్ణయం?
న్యూఢిల్లీ: లఢక్లో సరిహద్దు వివాదాన్ని యుద్ధం వరకూ తీసుకెళ్తోన్న డ్రాగన్ కంట్రీ చైనాతో అమీతుమీ తేల్చుకోబోతున్నట్లు కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఏమాత్రం అవకాశం ఇవ్వని విధంగా ముందుకెళ్లే దిశగా అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదు. చైనాతో తాడోపేడో తేల్చుకోవాలనే దృఢ సంకల్పం కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఎలాంటి ముందస్తు సంకేతాలు ఇవ్వకుండా.. లఢక్లో ఆకస్మిక పర్యటనకు పూనుకోవడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నారు విశ్లేషకులు.
Recommended Video
అనూహ్యం..అన్ ప్లాన్డ్: రక్షణ మంత్రిక్కూడా తెలియకుండా: లఢక్లో మోడీ: 11 వేల అడుగుల ఎత్తులో
లేహ్లో సరిహద్దు భద్రతపై సమీక్ష
వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన లఢక్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన ఆయన లేహ్లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల అందరి దృష్టీ అటు వైపు మళ్లింది. వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ వ్యాలీ వద్ద కిందటి నెల 15వ తేదీన రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు, మూడు దఫాలుగా చర్చలు ఫలితాలు రాకపోవడంతో ప్రధాని అనహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణెలతో కలిసి లేహ్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ముగ్గురు కీలక మంత్రులతో భేటీ
ఈ సమావేశం అనంతరం నరేంద్ర మోడీ తన కేబినెట్లోని ముగ్గురు కీలక మంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. దేశ రాజధానిలో ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్యణ్యం జైశంకర్లతో ఆయన సమావేశం అవుతారని సమాచారం. ఈ భేటీలో ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరవుతారని అంటున్నారు.
త్రివిధ దళాధిపతులతో..
ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్, వాయుసేన చీఫ్ రాకేష్ కుమార్ సింగ్ బదౌరియా ఈ భేటీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ముగ్గురు త్రివిధ దళాధిపతులు గనక ప్రధానమంత్రి నిర్వహించే అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరు కావడం అంటూ జరిగితే.. తదుపరి చర్యలు యుద్ధం వైపే మొగ్గు చూపే అవకాశాలను కొట్టి పారేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు.
14 కార్ప్స్ లెప్టినెంట్ కమాండర్తో
లేహ్ చేరుకున్న వెంటనే నరేంద్ర మోడీ, బిపిన్ రావత్, నరవణె 14 కార్ప్స్ సైన్యాధికారులతో సమావేశం అయ్యారు. ఫార్మర్డ్ పొజీషన్ నీమూ ప్రాంతంలో ఈ సమావేశం ఏర్పాటైంది. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. లెప్టినెంట్ కమాండర్ హర్వీందర్ సింగ్తో భేటీ అయ్యారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) లెప్టినెంట్ జనరల్ లియు లిన్తో ఇప్పటిదాకా మూడు దశలుగా భారత్ తరఫున చర్చకు ప్రాతినిథ్యాన్ని వహించింది హర్వీందర్ సింగే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చర్చల గురించి ప్రధాని ఆయనను అడిగి తెలుసుకున్నారు.