India EU Summit: ఆ హక్కులను ఎత్తేస్తే బెటర్..అదే మ్యాజిక్: కరోనా వ్యాక్సిన్లపై తేల్చేసిన మోడీ
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. అగ్రరాజ్యం అమెరికా మొదలుకుని ఆఫ్రికాలోని పేద దేశాల వరకూ ఈ టీకాల కార్యక్రమం నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగైదు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వీ, ఫైజర్, సినోఫార్మ్ వంటి వ్యాక్సిన్లను ఆయా దేశాలకు అందుతోంది. పేద దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉచితంగా సరఫరా చేస్తోంది. భారత్ సహా కొన్ని దేశాల్లో టీకాల కొరత నెలకొంది.
భారత్లో మూడోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో- వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. రెండో డోసు వ్యాక్సిన్ కోసం జనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఏర్పాటైన భారత్-యూరోపియన్ యూనియన్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి, కోవిడ్ సంబంధిత ట్రీట్మెంట్కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.
ఈ సమ్మిట్లో యూరోపియన్ యూనియన్లోని 27 సభ్య దేశాల అధినేతలు పాల్గొన్నారు. భారత్-ఈయూ సమ్మిట్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమ్మిట్ ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ అమలు చేస్తోన్న వ్యాపారపరమైన మేథో సంపత్తి హక్కుల (Trade-Related Aspects of Intellectual Property Rights-TRIPS) ను ఎత్తేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ట్రిప్స్ను రద్దు చేసిన తరువాత ప్రపంచ దేశాలు కొన్ని అద్భుతాలను చూడగలవని వ్యాఖ్యానించారు. కరోనా వ్యాక్సిన్లను కొరతను అధిగమించడానికి, కోవిడ్ సంబంధిత వైద్య చికిత్సలను అందించడానికి- మేథో సంపత్తి హక్కులను రద్దు చేయడం ఒక్కటే మ్యాజిక్ సొల్యూషన్గా మోడీ అభివర్ణించారు. ట్రిప్స్ను రద్దు చేయడానికి తాము మద్దతు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇదివరకే ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దక్షిణాఫ్రికా సైతం ఇదే కోరుకుంటోందని అన్నారు.
Recommended Video
దీనిపై ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు ఛార్లెస్ మైఖెల్ మాట్లాడుతూ- మేథో సంపత్తి హక్కుల రద్దు, వ్యాక్సిన్లపై ఈయూ సభ్య దేశాల మధ్య పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తోందని, త్వరలోనే దానికి పరిష్కారం దొరుకుతుందని అన్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలు.. ప్రపంచదేశాలకు ఫార్మసీగా హబ్గా మారాయని, ఇప్పటిదాకా 400 మిలియన్ల వ్యాక్సిన్లను తాము ఉత్పత్తి చేశామని, ఇందులో సగం వ్యాక్సిన్లను 90 దేశాలకు ఎగుమతి చేసినట్లు చెప్పారు.