నిర్లక్ష్యం వద్దు: ఫొని తుఫాన్ ప్రభావంపై ప్రధాని అత్యున్నత సమీక్ష
న్యూఢిల్లీ: తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ అత్యంత భయానకంగా రూపుదాల్చుతున్న ఫొని తుఫాన్ కేంద్ర ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేసింది. 1999లో ఒడిశాను అతలాకుతలం చేసిన సూపర్ సైక్లోన్ గా ఆవిర్భవించవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లల్లో ప్రభుత్వాలు ఇప్పటిదాకా చేపట్టిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టాన్ని నియంత్రించడమే విధిగా ప్రతి ఒక్క ఉద్యోగీ విధుల్లో పాల్గొనాలని సూచించారు.
ప్రధాని నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, అదనపు ముఖ్య కార్యదర్శి, కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి, వాతావరణ శాఖ అధికారులు, జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం, జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారులు హాజరయ్యారు
.
ప్రాణ నష్టాన్ని నియంత్రించండి:
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- తుఫాన్ సమయంలో, ఆ తరువాతి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్నారు. పెను తుఫాన్ విరుచుకుపడే అవకాశం ఉందంటూ నాలుగురోజుల కిందటే వాతావరణ శాఖ అధికారుల నుంచి పక్కా సమాచారం అందిందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి చాలినంత సమయం ఉందని అన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఆలక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు. తుఫాన్ తరువాతి పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలను తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. బలహీనంగా ఉన్న వంతెనలపై రాకపోకలను నిషేధించేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు.
ధీటుగా ఎదుర్కొంటాం: ఎన్డీఆర్ఎఫ్
ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ అధికారులు మాట్లాడుతూ.. ఒడిశాకు 28, ఏపీకి 12 ప్లాటూన్ల మేర బలగాలను పంపించినట్లు వివరించారు. అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యను చేపట్టామని అన్నారు. తీర ప్రాంత గ్రామాలను ఖాళీ చేయించామని, పల్లపు ప్రదేశాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించామని చెప్పారు. తుఫాన్ తరువాతి పరిస్థితులను ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉన్నామని వారు ప్రధానికి వివరించారు. పశ్చిమ బెంగాల్ సహా మూడు రాష్ట్రాల్లో తీర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వేశామని పేర్కొన్నారు.
1999 నాటి పరిస్థితులు పునరావృతం
1999లో ఒడిశాను అల్లకల్లోలానికి గురి చేసిన సూపర్ సైక్లోన్ నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రధానికి వివరించారు. ఫొని తుఫాన్ తీవ్రత మరింత పెరుగుతోందే తప్ప, బలహీనపడట్లేదని అన్నారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో ఈదురుగాలుల తీవ్రత కనీసం గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేయవచ్చని అన్నారు.