దక్షిణాదిపై పట్టు కోసం బీజేపీ ప్రయత్నం: తలైవాకు గాలం: కేంద్రంలో అనూహ్య పదవి?
చెన్నై: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడంతో జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. తటస్థంగా లేదా పరోక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతున్న పార్టీలు, నాయకులు తెర మీదికి వస్తున్నారు. బీజేపీకి బాహటంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రాజకీయ పార్టీని ప్రకటించి, చివరి నిమిషంలో లోక్సభ ఎన్నికల రేసు నుంచి తప్పుకొన్న దక్షిణాది సూపర్స్టార్ రజినీకాంత్..దీనికి మినహాయింపేమీ కాదు.
నెహ్రూ, రాజీవ్ గాంధీ, మోడీ..
ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తొలిసారిగా ఆయన మీడియా ముందుకొచ్చారు రజినీ. చెన్నైలోని తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోడీని మించిన ఛరిష్మా గల నాయకుడు దేశంలోనే లేరని అన్నారు. మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీల తరువాత ఆ స్థాయి ఛరిష్మా ఉన్న నేత నరేంద్ర మోడీ ఒక్కరేనని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా తనకు సోమవారమే ఆహ్వానం అందిందని, ఆ కార్యక్రమానికి తాను వెళ్తున్నానని అన్నారు. తమిళనాడులో పెరియార్, అన్నాదురై, కరుణానిధి, జయలలిత వంటి నాయకులు ఉన్నారని, వారితో సమానంగా మోడికి ఛరిష్మా ఉందని చెప్పారు.
తమిళనాడులో ఎన్డీఏ వ్యతిరేక గాలి వీచిందని, ఎలాంటి నాయకుడికైనా ఎదురీదటం సాధ్యం కాదని అన్నారు. స్టెరిలైట్ సంస్థ ఏర్పాటును రైతులు వ్యతిరేకించడం, నీట్ పరీక్షల ప్రభావం బీజేపీపై పడి ఉంటుందని అంచనా వేశారు.
వైఎస్ జగన్తో కుమార మంగళం బిర్లా భేటీ: చడీ చప్పుడు లేకుండా! పెట్టుబడులు పెడతారా?
రాహూల్ రాజీనామా అవసరం లేదు..
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తున్నట్లు వస్తోన్న వార్తలపై రజినీకాంత్ స్పందించారు. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. తనను తాను నిరూపించుకోవడానికి ఆయనకు ఈ ఎన్నికలు ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాయని అన్నారు. అధ్యక్షునిగా తన సత్తాను నిరూపించుకుని, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి వచ్చేలా సమాయాత్తం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందని చెప్పారు. సీనియర్లు ఆయనకు సహరించకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉంటుందని అన్నారు.
గోదావరి, కావేరీలను అనుసంధానం చేస్తామంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యాల పట్ల రజినీకాంత్ సానుకూలంగా స్పందించారు. దీన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. తమిళనాడు ఓటర్లు ఎన్డీఏను ఆదరించకపోయినప్పటికీ..రాష్ట్రానికి మేలు చేయడానికి గోదావరి, కృష్ణా, కావేరీ నదులను అనుసంధానించడానికి చర్యలు తీసుకోవడం గొప్ప విషయమని చెప్పారు.
తలైవాకు కేంద్రమంత్రివర్గంలో చోటు
కాగా- తమిళనాడులో బీజేపీ, ఆ పార్టీ సీట్ల సర్దుబాటు చేసుకున్న అన్నా డీఎంకే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యాయి. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వాటిల్లో రాయవేలూరు మినహాయించి 38 చోట్ల ఎన్నికలను నిర్వహించారు. వాటిల్లో 36 స్థానాలను కాంగ్రెస్-డీఎంకేల కూటమి గెలుచుకుంది. ఒక్కచోట అన్నాడీఎంకే విజయం సాధించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని- బీజేపీ దక్షిణాదిలో బలపడటానికి వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రజినీకాంత్కు కేంద్రంలో ఊహించని ప్రాధాన్యత కల్పించవచ్చని తెలుస్తోంది. ఆయనకు కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. రాజ్యసభకు ఎంపిక చేసి, మంత్రి పదవిని ఇచ్చే దిశగా బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతున్నట్లు సమాచారం.