ప్రధాని కావాలని కోరుకో..
బెంగళూరు: చంద్రయాన్-2 ప్రయోగం చివరి ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి బెంగళూరులోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (ఇస్రో) కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వారితో చేతులు కలుపుతూ ఉత్సాహంగా మాట్లాడారు. విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మోడీని ప్రశ్నలతో ముంచెత్తారు. శాస్త్ర సాంకేతిక రంగాలపై ఒకరిద్దరు అడిగిన ప్రశ్నలకు ప్రధాని బదులిచ్చారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రోకు అద్భుతమైన విజయాలు ఉన్నాయని చెప్పారు. వారి పేర్లు, ఏఏ ప్రాంతాల నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నారు.
ప్రయోగాల వైపు విద్యార్థులను మొగ్గు చూపేలా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విద్యార్థులు ప్రశ్నించారు. చంద్రయాన్-2 వైఫల్యంపై మీరెలా స్పందిస్తున్నారని ప్రధానిని అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ.. వైఫల్యం అనేది జీవితంలో సహజమేనని, వాటి గురించే ఆలోచిస్తూ కూర్చోకూడదని అన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలను నేర్చుకోవాలే తప్ప.. వాటి గురించి పదేపదే ఆలోచించకూడదని చెప్పారు.
నిరాశ, నిస్పృహలను ఆవహించనీయవద్దని హితవు పలికారు. మరో విద్యార్థి మాట్లాడుతూ తాను భవిష్యత్తులో భారత రాష్ట్రపతి కావాలని అకాంక్షిస్తున్నానని, దానికి ఎలాంటి అర్హతలు కావాలని ప్రశ్నించాడు. దీనికి మోడీ నవ్వుతూ.. ఆ విద్యార్థి భుజం మీద చేతులు వేసి.. ప్రధానమంత్రి కావాలని ఎందుకు కోరుకోవట్లేదు.. అని ప్రశ్నించారు.