మోడీ కాలు మోపారు: చంద్రయాన్-2పై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2 ప్రయోగంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-2 ప్రయోగం ప్రధాని నరేంద్ర మోడీ కారణంగానే విఫలమైందంటూ సరికొత్త వివాదానికి తెరతీశారు.
గురువారం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రయాన్ -2 ప్రయోగాన్ని తాను చేస్తున్నట్లు ప్రకటించుకోవడానికే ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరుకు వచ్చారని ఆరోపించారు.
చంద్రయాన్-2 ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు దాదాపు 10-12 సంవత్సరాలు తీవ్రంగా శ్రమించారని.. ఇస్రో కేంద్రంలో మోడీ అడుపెట్టడం వల్లే ఈ శాస్త్రవేత్తలకు దురదృష్టం పట్టుకుందని కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ రావడం వల్లే చంద్రయాన్ -2 ప్రయోగం విఫలమైందని ఆరోపించారు.
రైతు పింఛను పథకం ప్రారంభించిన మోడీ: నెలకు రూ.3వేలు, 5కోట్ల రైతులకు మేలు
చంద్రయాన్ 2లో విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అవడంతో ఇస్రో నుంచి సంకేతాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చంద్రుడికి 2.1కిలోమీటర్ల సమీపంలో ఉన్న సమయంలోనే ఇస్రోతో కమ్యూనికేషన్ తెగిపోయింది. అనంతరం చంద్రయాన్ -2 స్వల్పంగా విఫలమైందని చెప్పిన ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడిపెట్టుకున్న విషయం తెలిసిందే. అక్కడేవున్న ప్రధాని నరేంద్ర మోడీ.. శివన్ కౌగిలించుకుని ఓదార్చారు. జయాపజయాలు సాధారణమని, మరోసారి ప్రయత్నించి విజయం సాధిద్ధామని శాస్త్రవేత్తలకు ప్రధాని భరోసా ఇచ్చారు.
అయితే, విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనుగొన్నామని, దానితో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విక్రమ్ ల్యాండర్ కోసం తాజాగా నాసా కూడా ప్రయత్నాలు ప్రారంభించింది.