ఇది పేదల సంక్షేమ బడ్జెట్..! సీతమ్మ పద్దులపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని..!!
Recommended Video
న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బడ్జెట్ ద్వారా మధ్య తరగతి వర్గానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పన్ను విధానాన్ని సులభతరం చేశామని, అదే విధంగా మౌలిక వసతుల కల్పనలో సరికొత్త అభవృద్ధిని చూడబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. 'దేశంలోని ప్రతీ పౌరుడికి మేలు కలిగించే బడ్జెట్ ఇది. దీని ద్వారా పేదలకు మంచి జరుగుతుంది. యువతకు లబ్ది చేకూరుతుంది' అని వ్యాఖ్యానించారు. అదే విధంగా వ్యవసాయ రంగంలో విప్లవాలకు నాంది పలికేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని, నవభారతానికి ఇదొక రోడ్మ్యాప్లా ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా 2019-20 సంవత్సారానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. రక్షణశాఖ మంత్రిగా అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నఆమె ఆర్థిక మంత్రి హోదాలో మొట్టమొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళగా రికార్డులకెక్కారు.
బడ్జెట్పై ప్రధాని మోదీ స్పందన..! ప్రతి పౌరుడికి మేలు చేస్తుందన్న ప్రధాని..!!
మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఇందుకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రూ. 45 లక్షల ఇల్లు కొంటే రూ. 3.5 లక్షల మేర వడ్డీ రాయితీ కల్పిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా హోంలోన్ తీసుకున్న వారికి మరో లక్షన్నర వడ్డీ రాయితీ ఉంటుందని ప్రకటించారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు పెంచుతామని, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం అందిస్తామని నిర్మల పేర్కొన్నారు. ఈ క్రమంలో హౌజింగ్ ఫైనాన్స్ రంగాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి తీసుకువస్తామని వెల్లడించారు.
బరువెక్క నున్న ఖజానా..! నోట్ల స్థానంలో నాణేలు..!!
అదే విధంగా ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏడాదికి 5 లక్షల రూపాయల ఆదాయం దాటితే పన్ను విధిస్తామని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులకు 70 వేల రూపాయల కోట్ల మూల ధన సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా డ్వాక్రా మహిళలకు రూ. 5 వేల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తామన్నారు. ముద్రా పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు లక్ష రుణం అందజేస్తామని వెల్లడించారు. ఇక త్వరలోనే రూ. 1, 2, 5, 10, 20 కొత్త నాణేలు విడుదల కానున్నాయని పేర్కొన్నారు. కాగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.
ప్యాన్ కార్డు లేనివారికి ఊరట..! మోదీ ప్రభుత్వం వినూత్న ప్రయత్నం..!!
నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారికి ప్రత్యేక ధన్య వాదాలు చెబుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అత్యంత కీలకమైన ఆదాయం, పన్నులపై బడ్జెట్ ప్రసంగ భాగాన్ని ప్రారంభించారు. ఆదాయ పన్ను సమర్పణ సమయంలో ప్యాన్ కార్డు లేనివారికి ఊరట కల్పించే వార్త అందించారు. ప్యాన్ కార్టు లేకపోయినా.. కేవలం ఆధార్ కార్డు ద్వారా ఆదాయ రిటర్న్స్ను ఫైల్ చేయవచ్చని సీతారామన్ తెలిపారు. తద్వారా రిటర్న్స్ దాఖలు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. 120 కోట్లకు పైగా భారతీయులు ఇప్పుడు ఆధార్ కార్డును కలిగి ఉన్నారు, అందువల్ల పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ ప్రతిపాదన చేసినట్టు చెప్పారు.
పగబట్టనున్న పసిడి..! మరింత ప్రియం కానున్న బంగారం..!!
బంగారం ధరలు భారం కానున్నాయి. పార్లమెంట్లో శుక్రవారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మగువలకు ఇష్టమైన బంగారంపై పన్నుల భారం మోపారు. బంగారంపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను పెంచారు. బంగారం సహా ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. బంగారంపై సుంకాల పెంపుతో స్వర్ణాభరాణాలు మరింత ప్రియం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరగడంతో పాటు డాలర్తో రూపాయి మారకం బలహీనపడటంతో ఇప్పటికే భారమైన బంగారం ధరలు తాజాగా సుంకాల పెంపుతో మరింత పెరగనున్నాయి.మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం శుక్రవారం రూ 600 మేర పెరిగింది.