కుమరస్వామికి మోడీ అభినందనలు: 2019కి పెనుమార్పులన్న నూతన సీఎం
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన హెచ్డీ కుమారస్వామికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కుమారస్వామికి ఫోన్ చేసిన ప్రధాని శుభాకాంక్షలు చెప్పారు.
I congratulate Shri @hd_kumaraswamy Ji and @DrParameshwara Ji on taking oath as Chief Minister and Deputy Chief Minister of Karnataka. My best wishes for their tenure ahead.
— Narendra Modi (@narendramodi) May 23, 2018
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కూడా కుమారస్వామికి ట్విటర్ ద్వారా అభినందనలు చెప్పారు. 'అభినందనలు కుమారస్వామి, పరమేశ్వర. కొత్త ప్రభుత్వం సారథ్యంలో కర్ణాటకలో శాంతి, అభివృద్ధి నెలకొంటాయని ఆశిస్తున్నా' అంటూ రాజ్నాథ్ ట్వీట్ చేశారు.
2019కి పెనుమార్పులు తప్పవు: కుమారస్వామి
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం.. ఒక పార్టీ ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తుందని కర్ణాటక నూతన ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలి సారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
'ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాం. రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేం పనిచేస్తాం. మేమంతా ఒక్కటే అని దేశప్రజలకు సందేశం ఇచ్చేందుకు ఈనాడు అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. 2019లో రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయనేందుకు ఇదొక నిదర్శనం' అని కుమారస్వామి పేర్కొన్నారు.
'రాష్ట్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. అందుకే మేం ఉమ్మడిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మే 25న అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహిస్తాం. అప్పటి వరకు నాకు ఎటువంటి అధికారాలు లేవు. ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాం' అని ఆయన హామీ ఇచ్చారు. రైతుల పంట రుణ మాఫీపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.