పాక్,చైనాలతో యుద్దానికి డేట్ ఫిక్స్ చేసిన మోదీ.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా,పాకిస్తాన్లతో ఎప్పుడు యుద్దానికి దిగాలో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఖరారు చేశారని వ్యాఖ్యానించారు. అంతేకాదు,ఆ తేదీలు కూడా ఖరారయ్యాయని చెప్పారు. అయోధ్యలో రామ మందిరం,కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తదితర అంశాల తరహాలోనే ప్రధాని మోదీ దీనిపై కూడా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ ఇంటి వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్వతంత్ర దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
స్వతంత్ర దేవ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే వీడియోలో స్వతంత్ర దేవ్ సమాజ్వాదీ పార్టీ నేతలను,బహుజన్ సమాజ్ పార్టీ నేతలను ఉగ్రవాదులతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ ఎంపీ రవీంద్ర కుష్వాహాను మీడియా వివరణ కోరగా... పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే స్వతంత్ర దేవ్ ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పడం గమనార్హం.
సరిహద్దుల్లో పాకిస్తాన్,చైనాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో స్వతంత్ర దేవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓవైపు కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్,జైశంకర్... సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించడం,శాంతిని నెలకొల్పడమే తమ ప్రియారిటీ అని చెబుతుండగా... స్వతంత్ర దేవ్ మాత్రం యుద్దానికి తేదీలు కూడా ఫిక్స్ చేశారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఆదివారం(అక్టోబర్ 25) డార్జిలింగ్లోని సుక్నా యుద్ద స్మారకాన్ని సందర్శించిన సందర్భంగా కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ... సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడమే తమ అభిమతమని స్పస్టం చేశారు. సరిహద్దులో ఉద్రిక్తతలకు త్వరగా తెరపడాలని కోరుకుంటున్నామని... ఆ నమ్మకం ఉందని అన్నారు. భారత భూభాగంలో ఒక్క అంగుళాన్ని కూడా వదులుకునే ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పారు.