కరోనా : సోనియా,కేసీఆర్లకు మోదీ ఫోన్.. ఏం మాట్లాడారు..?
కరోనా వైరస్ను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు దేశం కుల,మత,ప్రాంత,రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు అనుగుణంగా కేంద్రం కూడా అవసరమైన చర్యలు తీసుకుంటోంది. రాజకీయ భేషజాలను పక్కనపెట్టి కరోనా ఎఫెక్ట్తో దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రత్యర్థులకు సైతం ప్రధాని మోదీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. తాజాగా మోదీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఫోన్ చేసి క్షేత్ర స్థాయిలో కరోనా పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం.
అనంతరం మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ,ప్రతిభా పాటిల్,మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్,దేవే గౌడలను కూడా మోదీ ఫోన్ ద్వారా సంప్రదించినట్టు సమాచారం. వీరితో పాటు సమాజ్వాదీ అధినేతలు ములాయం,అఖిలేష్ యాదవ్,తృణమూల్ చీఫ్,బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్లతోనూ ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,డీఎంకె అధినేత ఎంకె స్టాలిన్,శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్లతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ రెండో వారంలోకి ప్రవేశించిన తర్వాత ప్రధాని నుంచి ఆయా నేతలకు ఫోన్ కాల్స్ వెళ్లడం గమనార్హం. కరోనాపై పోరులో అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లడానికే ప్రధాని అన్ని పార్టీల సీనియర్ నేతలకు ఫోన్ కాల్స్ చేసినట్టు చెబుతున్నారు. అయితే ఎవరెవరితో ప్రత్యేకంగా దేనిపై చర్చించారన్నది తెలియరాలేదు. ఇటీవల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో లాక్ డౌన్ ఎత్తివేతపై కామన్ ఎగ్జిట్ స్ట్రాటజీతో ముందుకు రావాలని మోదీ వారికి సూచించిన సంగతి తెలిసిందే. అయితే గడిచిన 3,4 రోజుల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతండటంతో.. లాక్ డౌన్ ఎత్తివేతపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై ఆయన అన్ని పార్టీల నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు భారత్లో 3588 కేసులు నమోదవగా.. 99 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లోనే 472 కొత్త కేసులు నమోదయ్యాయి.