వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని.. ప్రతిపాదించిన వారిలో చౌకీదార్, కాటికాపరి
ఈ లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. నామినేషన్ దాఖలు చేసేందుకు గురువారం సాయంత్రమే వారణాసికి చేరుకున్న ప్రధాని అక్కడ మెగా రోడ్షో కార్యక్రమంలో పాల్లొన్నారు. దాదాపు ఏడు కిలోమీటర్ల మేరా రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని మోడీ వారణాసి ఘాట్లో పవిత్ర గంగానదికి హారతి పట్టారు. అనంతరం శుక్రవారం రోజు ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటికే వారణాసిలో బీజేపీ గెలుపు ఖాయమైందని చెప్పారు.
కలెక్టర్ కార్యాలయంలో మోడీకి ఘనస్వాగతం
వారణాసిలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ నేరుగా కలెక్టర్ కార్యాలయానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. దారి పొడవున అభిమానులు కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. గురువారం నుంచే వారణాసి నగరం అంతా కాషాయమయం అయ్యింది. ఎటు చూసిన మోడీ నినాదాలతో వారణాసి ప్రాంతం మార్మోగిపోయింది. ఇక మోడీ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు బీజేపీ మిత్ర పక్షాలు అధినేతలు హాజరయ్యారు. ఇందులో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్లతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, శిరోమణి అకాళీదల్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్, శివసేన బాస్ ఉద్ధవ్ థాక్రేలు హాజరయ్యారు.
మోడీ పేరును ప్రతిపాదించిన కాటికాపరి
సరిగ్గా 11 గంటల 20 నిమిషాలకు మోడీ కలెక్టొరేట్కు చేరుకున్నారు. అక్కడ పూల వర్షంతో స్వాగతం పలికారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. అనంతరం శిరోమణి అకాలీదల్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ పాదాలకు నమస్కరించి మోడీ దీవెనలు తీసుకున్నారు. అప్పటికే ఆ గదిలో ఉన్న వారందరిని పలకరించి వారితో ముచ్చటించారు. మరోవైపు మోడీ నామినేషన్ను ప్రతిపాదించిన వారిలో చౌకీదార్ (కాపలదారుడు), దళితుడైన ఓ కాటికాపరి, కూడా ఉన్నారు. ఒకరు ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఉండగా మరొకరు పనిని కన్య మహావిద్యాలయ ప్రిన్సిపాల్ నందిత శాస్త్రి చతుర్వేది ఉన్నారు. మోడీని ప్రతిపాదించడం ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.
ప్రతిపాదితుల ఎంపిక వ్యూహాత్మకంగా జరిగింది: అనలిస్టులు
మోడీ నామినేషన్కు ప్రతిపాదులుగా ఉన్నవారి ఎంపిక చాలా వ్యూహాత్మకంగా జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దళితులు, వ్యాపారులు ఇతర వర్గాల వారిని ఆకట్టుకునేలా వారి ఎంపిక జరిగిందని అభిప్రాయపడ్డారు. 2014 నామినేషన్ దాఖలు సమయంలో బెనారస్ హిందూ యూనివర్శిటీ వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవియా మనవడు గిరిధర్ మాలవియా, అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ , పద్మవిభూషణ్ గ్రహీత క్లాసికల్ సింగర్ చాను లాల్ మిశ్రా, నావికుడు వీర్ భద్ర నిషద్ మరియు నేతన్న అయిన అశోక్ మౌర్యాలు ప్రతిపాదించారు.
అయితే ప్రధాని మోడీ నామినేషన్కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అంతకుముందు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ వారణాసిలో బీజేపీ గెలుపు ఖాయమైందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదని అందరూ తిరిగి మోడీనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఓవర్ రియాక్ట్ అయ్యారని అందుకే 400 నుంచి 40 స్థానాలకు పడిపోయారని చెప్పారు. ఇదిలా ఉంటే 2014లో ఇదే వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని మోడీ 3.37 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.ఈ సారి కాంగ్రెస్ నుంచి మోడీ ప్రత్యర్థిగా అజయ్ రాయ్ బరిలో ఉన్నారు.