పాకిస్థాన్ తో యుధ్ధం, సైనికులను అవమానించిన కాంగ్రెస్, వీరకన్నడిగులు, మోడీ సెంటిమెంట్!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. పాకీస్థాన్ మీద యుద్దం చేసి విజయం సాధించిన వీర కన్ననడిగులను అప్పటి ప్రధాని నెహ్రూ తీవ్రస్థాయిలో అవమానించారని, అది ఆ పార్టీ సంసృతి అని నరేంద్ర మోడీ ఆరోపించారు. కలబురిగిలోని ఎన్ వీ కాలేజ్ మైదానంలో గురువారం మద్యాహ్నం జరిగిన బహిరంగ సభలో ప్రాంతీయ ఐక్యతతో కన్నడిగులకు కాంగ్రెస్ మీద కసి పెరిగి అసహ్యం వచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ తనదైశ శైలిలో ప్రసంగించారు.
జనరల్ తిమ్మయ్యకు అవమానం
1948లో పాకిస్థాన్ మీద యుద్దం చేసిన భారత్ విజయం సాధించిందని, ఆ రోజు కర్ణాటక వీర పుత్రుడు జనరల్ తిమ్మయ్యను అప్పటి ప్రధాని నెహ్రూ అభినందించాల్సిందిపోయి తీవ్రస్థాయిలో అవమానించారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.
వీరకన్నడిగకు అవమానం
కర్ణాటక పుత్రుడు ఫీల్డ్ మార్షల్ కార్యప్ప దేశ రక్షణ కోసం ఆయన ప్రాణాలు త్యాగం చేశారని, అలాంటి వీరుడిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఫీల్డ్ మార్షల్ కార్యప్పను ఆదర్శంగా తీసుకుని తాము సర్జికల్ స్రైక్ చేసి ఉగ్రవాదులకు తగిన బుధ్ది చెప్పామని, అయితే సర్జికల్ స్టైక్ కు సాక్షాలు కావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి సైనికులను అవమానించిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.
హైదరాబాద్ నవాబులు
సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గుర్తు చేసుకున్న నరేంద్ర మోడీ కాంగ్రెస్ మీద మరోసారి నిప్పులుచెరిగారు. హైదరాబాద్ నవాబుల నుంచి హైదరాబాద్ కర్ణాటకు స్వాతంత్రం ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ సైనికులను అవమానించే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కావాలా ? దేశభక్తి ఉన్న బీజేపీ కావాలా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ కన్నడిగులను ప్రశ్నించారు.
కృష్ణ-తుంగభద్రాతో అన్యాయం
కేంద్ర ప్రభుత్వంకు చెందిన ఎంఇపీ పథకం అమలు కాకుండా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాకుండా అడ్డుకుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఇక్కడి ప్రజలకు జీవనాడి అయిన కృష్ణ-తుంగభద్రా నదుల నీరు రైతులకు సక్రమంగా అందించకుండా వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, బీజేపీని అధికారంలోకి తీసుకు తీసుకురావాలని, ఫసల్ భీమా యోజన పథకం అమలు చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ కన్నడిగులకు మనవి చేశారు.
దళితులను మోసం చేసిన కాంగ్రెస్
2013లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. అయితే మల్లికార్జున ఖార్గేని ఢిల్లీకి పంపించి సిద్దరామయ్యను సీఎం చేసి దళితులను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. మల్లికార్జున ఖార్గేని వరుసగా గెలిపిస్తున్నారు, ఆయన ఈ ప్రాంతానికి ఏమి చేశారని నరేంద్ర మోడీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ రాక్షస పాలన
కర్ణాటకలో కాంగ్రెస్ రాక్షస పాలనను ఇంటికి పంపించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ మనవి చేశారు. బీఎస్. యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయితే మీ కష్టాలు తీరిపోతాయని, ఆదివాసులు, ఎస్సీలు, ఎస్టీలకు బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏ పార్టీ ఇవ్వలేదని, బీజేపీకే ఓటు వెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీ మనవి చేశారు.
ఢిల్లీలో క్యాడర్ వాక్
ఢిల్లీలో క్యాడర్ వాక్ (రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ) చేసే వారిని ప్రశ్నిస్తున్నా, కలబురిగి సమీపంలోని బీదర్ లో దళిత బాలిక మీద అత్యాచారం చేస్తే మీరు ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు అని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు.