ప్రధాని మరో అఛీవ్మెంట్: యూఎన్ అత్యున్నత పర్యావరణ పురస్కారానికి మోడీ ఎంపిక
న్యూయార్క్ : ప్రధాని నరేంద్ర మోడీకి ఐక్యరాజ్యసమితి అత్యున్నత ప్రకృతి పురస్కారాన్ని ప్రకటించింది. 2022 నాటికి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలంటూ ప్రతిజ్ఞ చేయడంతోపాటు దేశ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి విస్తృత అవగాహన కల్పిస్తున్నందుకు గాను ఈ పురస్కారాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా సోలార్ వినియోగం అందుబాటులోకి రావాలంటూ అంతర్జాతీయ నేతలతో సైతం దీనిపై చర్చలు జరుపుతున్నందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఈ పురస్కారం ప్రకటించింది.
ప్రధాని మోడీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రన్లను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది ఐక్యరాజ్యసమితి. అంతేకాదు ఇరునేతలు అంతర్జాతీయ సౌరవిద్యుత్ కూటమి ఏర్పాటుకు వీరు నాయకత్వం వహిస్తుండటం అదే సమయంలో ప్రకృతిని పరిరక్షించుకోవడంలో వీరు చేస్తున్న కృషి అద్బుతమని యూఎన్ కొనియాడింది. పర్యావరణ పరిరక్షణ కోసం శ్రమిస్తున్న ఆరుగురిని కూడా ఈ సందర్భంగా ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును ప్రకటించింది యూఎన్.
"ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ " ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారం. దీన్ని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారికి అందజేస్తారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోనే కాక, పౌరసమాజంలోని వ్యక్తులు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం వారు చేసిన కృషి తద్వారా పర్యావరణం పై పాజిటివ్ ఇంపాక్ట్ ఏర్పడితే అలాంటి వారికి ఈ పురస్కారాన్ని అందజేస్తోంది ఐక్యరాజ్య సమితి.
కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సౌరశక్తిని వినియోగిస్తున్నందున ఎంట్రప్రిన్యూర్ విజన్ అవార్డు సొంతం చేసుకుంది. సౌరశక్తి వినియోగంతో కొచ్చిన్ విమానాశ్రయం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని దీనివల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంలో కొచ్చిన్ ముందువరసలో ఉందని ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటనలో తెలిపింది.
73వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ గాలా పేరుతో న్యూయార్క్లో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రధాని మోడీకి యూఎన్ అత్యున్నత పురస్కారం రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానికి అభినందనలు ట్వీట్ ద్వారా తెలిపారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.