ఎన్నికలు: ఈనాడు పేపర్, నాగార్జున, కేసీఆర్, జగన్, చంద్రబాబులకు మోడీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ, సినీ, క్రీడా తదితర రంగాల్లోని ప్రముఖులకు, మీడియాకు ప్రధాని నరేంద్ర మోడీ ఓ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. తన వ్యతిరేక పార్టీలకు కూడా విజ్ఞప్తి చేసి.. ఓటింగ్ పెంచాలని వారికి ట్యాగ్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టాలీవుడ్ నటుడు నాగార్జున, బాలీవుడ్ తారలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, క్రీడాకారులు విరాట్ కోహ్లీ, ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సచిన్ టెండుల్కర్ తదితరులకు విజ్ఞప్తి చేశారు.
రెండేళ్ల కిందటే సీబీఐకి ఈడీ సంచలన లేఖ!: ఎన్నికలకు ముందు జగన్కు 'హైదరాబాద్' షాక్
రాహుల్ గాంధీ, మమత, మాయావతిలకు విజ్ఞప్తి
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి, ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేలా చూడాలని మోడీ విజ్ఞప్తి చేశారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేలా ఓటర్లను ప్రోత్సహించాలన్నారు. దేశవ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలను పెంచాలని, రాష్ట్రాల్లో పోలింగ్ బూత్లకు ఎక్కువ మంది వచ్చేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఓటింగ్ పెంచేలా చూడాలని రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, మాయావతి, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, స్టాలిన్లను మోడీ కోరారు. ఓటింగ్ ఎక్కువ నమోదు కావాలన్నారు.
కేసీఆర్, చంద్రబాబు, జగన్లకు విజ్ఞప్తి
ఎక్కువమంది ఓట్లు వేసేలా చూడాలని కేసీఆర్, నవీన్ పట్నాయక్, కుమారస్వామి, చంద్రబాబు, జగన్, నితీశ్ కుమార్ తదితరులను కోరుతున్నానని మోడీ మరో ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ శాతం ఎంత నమోదయిందే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. హరిసిమ్రాత్ బాదల్, థాకరే, పాశ్వాన్, పవన్ చామ్లింగ్లకు కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
నాగార్జున, మోహన్లాల్లకు విజ్ఞప్తి
దక్షిణాది సినీ తారలు మోహన్ లాల్, నాగార్జునలకు కూడా మోడీ విజ్ఞప్తి చేశారు. 'మోహన్లాల్, నాగార్జున గారు.. మీ ప్రదర్శనలతో కోట్ల మంది అభిమానులను ఆనందపరుస్తున్నారు. అందుకు ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. మీలాంటి వారు ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది' అని ట్వీట్లో చేశారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, క్రీడా ప్రముఖులు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, క్రికెటర్లు ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఫోగట్ సోదరీమణులు గీతా, బబిత, విన్నేశ్, బాలీవుడ్ ప్రముఖులు దీపికా పదుకొణె, ఆలియా భట్, అనుష్క శర్మ, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, షారూక ఖాన్, కరణ్ జోహార్ తదితరులను కూడా మోడీ కోరారు. ఇతర రంగాల్లోని కిరణ్ బేడీ, కైలాష్ సత్యార్థి, రామ్ దేవ్ బాబా, సద్గురు జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్, నీరజ్ చోప్రా, రెజ్లర్ సుశీల్, రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, ఆశిష్ చౌహాన్ తదితరులను అభ్యర్థించారు.
ఈనాడు సహా పలు మీడియా సంస్థలకు
అలాగే, మీడియా సంస్థలను కూడా మోడీ అభ్యర్థించారు. ఈనాడు, దినతంతి, మాతృభూమి వంటి పలు పత్రికల పేరుతో ట్వీట్ చేశారు. మీరు ప్రజల గొంతు వినిపిస్తున్నారని, ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ఓటర్లను మరింత జాగృతం చేయాల్సి ఉందని, పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనేలా చూడాలని కోరారు. చివరగా భారతీయులందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు.