ప్రధాని సంచలన నిర్ణయం, జమ్మూ కాశ్మీర్ బ్లూ ప్రింట్, మంత్రులతో కమిటి, డెడ్ లైన్ !
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ అభివృద్ది విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ను అభివృద్ది చెయ్యడానికి మంత్రులతో ఓ ప్రత్యేక కమిటీ వేసి బ్లూ ప్రింట్ తయారు చేయిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (GoM)సమావేశాలు నిర్వహించి జమ్మూ, కాశ్మీర్ ను ఎలా అభివృద్ది చెయ్యాలి అని చర్చించి అక్టోబర్ లోపు ప్రధానికి నివేదిక ఇవ్వడానికి సిద్దం అయ్యింది.
బీజేపీలోని సీనియర్ నాయకుడు ఇండియా టుడే టీవీ చానల్ కు ఆవివరాలు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలో కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు రవి శంకర్ ప్రసాద్, తవార్ చంద్ గొహ్లెట్, జితేంద్ర సింగ్, నరేంద్ర తోమర్, ధర్మేంద్ర ప్రధాన్ లు ఉన్నారు.
కేంద్ర మంత్రుల ప్రత్యేక కమిటీ జమ్మూ కాశ్మీర్ ను మరింత అభివృద్ది ఎలా చెయ్యాలి అనే విషయంలో బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, తవార్ చంద్ గొహ్లెట్, జితేంద్ర సింగ్, నరేంద్ర తోమర్, ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం కీలక శాఖల భాద్యతలు చూస్తున్నారు.
జమ్మూ, కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత ఆ ప్రాంతాల అభివృద్ది విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టిసారించారు. జమ్మూ, కాశ్మీర్ ను ఎలా అభివృద్ది చెయ్యాలి అనే పూర్తి సమాచారం అక్టోబర్ 31వ తేదీలోపు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక మంత్రుల కమిటీకి సూచించారు.
ఇప్పటికే కేంద్ర మంత్రుల ప్రత్యేక కమిటీ రెండు సార్లు భేటీ అయ్యింది. జమ్మూ, కాశ్మీర్ లో యువత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మరింత అభివృద్ది చెయ్యాలని, ఆ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చెయ్యాలని నిర్ణయించారని తెలిసింది.
జమ్మూ, కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టులో మొత్తం 15 పిటిషన్లు దాఖలు అయ్యాయి. బుధవారం పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. ఐదు మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని, అక్టోబర్ మొదటి వారంలో రాజ్యంగ ధర్మాసనం విచారణ చేస్తుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయి స్పష్టం చేశారు. పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, జమ్మూ, కాశ్మీర్ పరిపాలనా యంత్రంగానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.