ఎమ్మెల్యేలను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారు, మోడీ ఒత్తిడి, మాజీ సీఎం కుమారస్వామి ఫైర్ !
బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లా విజయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ పై విజయం సాధించి మాయం అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులతో బెదిరిస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన హెచ్.డి. కుమారస్వామి ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి ఈడీ అధికారులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు.
ప్రధాని మోడీ దెబ్బ
కర్ణాటకలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకోసం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. ఈడీ అధికారులను ఉప యోగించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేస్తున్నారని కుమారస్వామి మండిపడ్డారు.
విలపించిన ఆనంద్ సింగ్
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లో తన మీద కేసు ఉందని, ఈ విషయంలో నన్ను వారు వదిలిపెట్టరని దయచేసి నన్ను వదిలేయండి అంటూ ఆనంద్ సింగ్ సాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర బోరున విలపించారని హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు.
బీజేపీకి వ్యతిరేకం
కేంద్ర ప్రభుత్వం స్వయం సంఘ, సంస్థలను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ఆడుతుందని, దేశాన్ని రక్షించడానికి మనం అందరూ ఒక్కటి కావలసిన సమయం వచ్చిందని, బీజేపీని ఎదుర్కొవడానికి ప్రాంతీయ పార్టీలతో మాట్లాడాలని తన తండ్రి హెచ్.డి. దేవేగౌడకు మనవి చేశానని కుమారస్వామి అన్నారు.
బీజేపీ గాలం వేస్తోంది
మా శాసన సభ్యులను రక్షించుకోవడం మా హక్కు అని హెచ్.డి. కుమారస్వామి అన్నారు. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు శాసన సభ్యులను మభ్యపెట్టి వారిని కొనుగోలు చెయ్యడానికి సిద్దం అయ్యారని కుమారస్వామి ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మెజారిటీ ఎమ్మెల్యేలు లేరని, గవర్నర్ తన పదవిని దుర్వినియోగం చేసి ఇలా ప్రవర్థిస్తున్నారని హెచ్.డి. కుమారస్వామి విమర్శించారు.