‘డియర్ ఫ్రెండ్’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మోడీ విషెస్
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్నకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. సోమవారం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ రోటుండాలో జరిగిన కార్యక్రమంలో రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు డొనాల్డ్ ట్రంప్.
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ నకు ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. డియర్ ఫ్రెండ్ అంటూ ప్రధాని మోడీ.. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ నకు అభినందనలు తెలిపారు.

'అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నా ప్రియ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్నకు అభినందనలు. ఇరుదేశాల ప్రయోజనాలు, ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందించడం కోసం మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. మీ పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలి' అని ఆకాంక్షిస్తూ ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ తొలి ప్రసంగంలోనే కీలక ప్రకటనలు చేశారు. అమెరికాలో నేటి నుంచి స్వర్ణయుగం ప్రారంభమైందన్నారు. అమెరికా ఫస్ట్ అనేద నా నినాదం. అమెరికా అనేక అటుపోట్లను తట్టుకుని నిలబడింది. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాం. ఇవాళ్టి నుంచి అమెరికా ప్రపంచ దేశాల గౌరవం పొందుతుందని అని అన్నారు. అంతేగాక, దేశంలో నేరాలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.
అమెరికా విద్య రంగంలో త్వరలో సంస్కరణలు తీసుకొస్తామని ట్రంప్ ప్రకటించారు. అమెరికా దక్షిణ సరిహద్దు్లో అత్యయిక పరిస్థితి విధిస్తామని చెప్పారు. అక్రమ వలసలు అరికట్టేందుకు సత్వర చర్యలు చేపడతామని అన్నారు. అమెరికాలోకి నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నరు. ఉగ్రవాదాన్ని అణచివేస్తామని అన్నారు. నేరాలు చేసే ముఠాలపై కఠినంగా ఉంటామన్నారు.












Click it and Unblock the Notifications