కష్టకాలంలో దేశానికి అద్భుత నాయకత్వం: పీవీపై మోడీ, నేడు 97వ జయంతి
న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించారు. పీవీ నర్సింహా రావు ఓ రాజనీతిజ్ఞుడు అని పేర్కొన్నారు. దేశ కష్టకాలంలో పీవీ అద్భుతమైన నాయకత్వం అందించారన్నారు. పీవీ లోతైన పరిజ్ఞానం, విజ్ఞత కలిగిన వ్యక్తి అన్నారు.
పీవీ నర్సింహా రావు బహుభాషా కోవిదుడు, నూతన ఆర్ధిక సంస్కరణలను దేశానికి పరిచయం చేసిన ఆర్ధిక వేత్త అని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి కొనియాడారు. పీవీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించారు.
మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపిన ఘనత పీవీదే అన్నారు. పీవీ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు సమంజసం కాదన్నారు.
పీవీ నర్సింహా రావు చిత్రపటానికి టీడీపీ ఎంపీలు ఢిల్లీలోని ఏఫీ భవన్ వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు. భారతదేశానికి ప్రధానులుగా చేసిన వారందరిలో పీవీది ప్రత్యేక శైలి అన్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించారన్నారు.