ఇండియన్ ఆర్మీకి ‘అర్జున్’ ట్యాంక్ అప్పగించిన ప్రధాని మోడీ: ఎన్నో అద్భుతాల యుద్ధ ట్యాంక్ ఇది
చెన్నై: దేశీయంగా అభివద్ధి చేసిన అత్యాధునిక యుద్ధ ట్యాంక్ 'అర్జున్' భారత సైన్యం అమ్ములపొదిలోకి చేరింది. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రపంచ స్థాయి ఆయుధాలతో పోటీపడే 'అర్జున్' ట్యాంక్ను అధికారికంగా సైన్యాధిపతి ఎంఎం నరవాణేకు అప్పగించారు.
Recommended Video
అతిపెద్ద అధునాతన యుద్ధ ట్యాంక్ అర్జున్
కాగా, తేజస్ తర్వాత ఆత్మనిర్బర్ భారత్ కింద భారత దళాలకు అందిన మరో అతిపెద్ద అధునాతన ఆయుధం అర్జున్ మార్క్1ఏ యుద్ధ ట్యాంకు కావడం గమనార్హం. వాస్తవానికి ఇప్పటికే సైన్యంలో అర్జున్(ఎంబీటీ) యుద్ధ ట్యాంకులు సేవలు అందిస్తున్నాయి. కానీ, దాదాపు 71 చిన్న, పెద్ద మార్పులతో అర్జున్ మార్క్ 1ఏ రూపంలో అప్డేట్ వెర్షన్ను తీసుకొచ్చారు.
బలమైన ఆత్మరక్షణ వ్యవస్థ..
భవిష్యత్ యుద్ధ తంత్రానికి చెందిన వ్యవస్థలు దీనిలో ఉన్నాయి. వీటిని హంటర్ కిల్లర్స్ అని కూడా పిలుస్తారు. అన్ని రకాల వాతావరణ పరిస్థిత్తోనూ ఇది స్థిరంగా పనిచేయగలదు. ఇది సుమారు 68 టన్నులు బరువు ఉంటుంది. 120 ఎంఎం రౌండ్స్ వినియోగించే గన్ను దీనికి అమర్చారు. ఈ ట్యాంక్ డీఆర్డీవో చెన్నై విభాగంలోని కాంబాట్ వెహికిల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది. ఈ ట్యాంకులో 14 వరకు ప్రధాన మార్పులు ఉన్నాయి. వీటిల్లో పేటెంట్ పొందిన టెక్నాలజీనే అత్యధికంగా వినియోగించారు. ఈ ట్యాంక్ ఆత్మరక్షణ వ్యవస్థ కూడా బలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
అద్భుత వ్యవస్థలతో అర్జున్ యుద్ధ ట్యాంక్..
కాగా, అర్జున్ ట్యాంక్ గన్లో లక్ష్యాన్ని ఆటోమేటిక్గా ట్రాక్ చేసే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో వేగంగా కదులుతున్న లక్ష్యాలను కూడా ఈ ట్యాంక్ సులభంగా పేల్చివేయగలదు. ట్యాంగ్ వేగంగా ప్రయాణిస్తూ కూడా ఇతర లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. కంప్యూటర్లోని ఇంటిగ్రేటెడ్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ గన్ను నియంత్రిస్తుంది. రాత్రి, పగలు తేడా లేకుండా లక్ష్యాలను సులభంగా గుర్తించే వ్యవస్త కూడా దీనిలో ఉండటం విశేషం.
ప్రపంచ స్థాయి ఆధాయుదాలతో పోటీపడే సత్తా..
అంతేగాక, అర్జున్ యుద్ధ ట్యాంక్ ఉపయోగించే తూటాలు కూడా ప్రత్యేకమైనవి. దీని తూటా(మందుగుండు) లక్ష్యాన్ని చేరుకోగానే అక్కడి ఆక్సిజన్ను పూర్తిగా వినియోగించుకుని పేలుతుంది. దీంతోపాటు చొచ్చుకుపోయిన తర్వాత విస్ఫోటనం చెందేలా వీటిని తయారు చేశారు. ప్రపంచ స్థాయికి మన ఆర్మీ వ్యవస్థను తీసుకెళ్లేందుకు సైనిక వ్యవస్థలు అనేక అత్యాధునిక ఆయుధాలను చేర్చుతున్నామని, అదే సమయంలో సైనికుల రక్షణ కోసం కోసం చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోడీ.. అర్జున్ ట్యాంక్ అందజేసిన సందర్భంగా వ్యాఖ్యానించారు.