చైనాపై తాడో పేడో: ఎల్లుండి అఖిలపక్ష భేటీ: కమ్యూనిస్టులపై ఫోకస్: యుద్ధం చివరి అస్త్రంగా
న్యూఢిల్లీ: చైనాపై తాడోపేడో తేల్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సమాయాత్తమౌతోంది. అకారణంగా చైనా.. 20 మంది భారత జవాన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకుందని భావిస్తోంది. వారి త్యాగాలను వృధా కానివ్వబోమంటూ రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన కొద్దిసేపటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. చైనాను దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చైనాను ఎలా నియంత్రించాలనే అంశంపై శుక్రవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
Recommended Video
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు..
సాయంత్రం 5 గంటలకు నరేంద్ర మోడీ తన కార్యాలయం నుంచి దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. వర్చువల్ పద్ధతిన ఈ సమావేశాన్ని నిర్వహిస్తారని స్పష్టం చేసింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సహా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులతో ప్రధానమంత్రి సంభాషిస్తారు. వారి అభిప్రాయాలను సేకరిస్తారు.
23 ప్రతిపక్ష పార్టీలతో..
ఏఏ పార్టీలకు అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన ఆహ్వానం అందిందనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలను పక్కన పెడితే.. 23 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీలన్నింటితోనూ ప్రధాని వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశాలు లేకపోలేదు. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలతో పాటు కాంగ్రెస్, సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీ, శివసేన, డీఎంకే, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రతిపక్షాల అధినేతలతో ప్రధానమంత్రి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చివరి అస్త్రంగా మాత్రమే యుద్ధం..
చైనాపై ఎలాంటి వైఖరిని అనుసరించాలనే విషయాన్ని ప్రధానంగా ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశంలో చర్చకు రానుంది.
చైనా దుందుడుకు చర్యలను అడ్డుకోవడానికి దౌత్యపరమైన చర్యలను తీసుకోవడం, ద్వైపాక్షిక చర్చల ద్వారా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడం, లేదా ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికల మీద చైనా వైఖరిని ప్రస్తావనకు తీసుకుని రావడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నారు.
వామపక్షాలపై అందరి దృష్టీ..
యుద్ధానికి దిగాలనేది చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగించవచ్చని అంటున్నారు. నరేంద్ర మోడీ అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టీ కమ్యూనిస్టులపై పడింది. సీపీఐ, సీపీఎం సహా తొమ్మిది వామపక్ష పార్టీల నాయకుల అభిప్రాయం ఏమిటనేది ఈ సమావేశంలో తేటతెల్లమౌతుందని అంటున్నారు. చైనాలో కమ్యూనిస్టుల పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఒకరకంగా చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీ చైనాలో శాశ్వతంగా అధికారంలో ఉండబోతోంది.
ఈ సారి కమ్యూనిస్టుల అభిప్రాయం ఎలా ఉంటుందనేది
చైనాతో విభేదాలు తలెత్తిన ప్రతీసారీ కమ్యూనిస్టులు ఒకింత వరకు చైనా వైపు మొగ్గు చూపిన సందర్భాలు లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో అఖిలపక్ష సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీల వైఖరి ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు ప్రాణాంతక దాడులకు పాల్పడటం, భారత్ 20 మంది జవాన్లను కోల్పోవాల్సి రావడం వంటి పరిణామాల మధ్య కమ్యూనిస్టు నేతలు ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తారనేది ఈ అఖిల పక్ష భేటీలో స్పష్టమౌతుంది.