మోడీ లుక్ అదుర్స్: సంప్రదాయ తమిళ వస్త్రధారణలో కనిపించిన ప్రధాని
మహాబలిపురం: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత పర్యటన ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయంకు చేరుకున్న జిన్పింగ్ నేరుగా ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్కు చేరుకున్నారు. దారిపొడవునా ఆయనకు ఘనస్వాగతం లభించింది. అనంతరం ఆయన కాసేపు హోటల్లో విశ్రాంతి తీసుకుని మహాబలిపురంకు బయలుదేరి వెళ్లారు. మహాబలిపురంకు చేరుకున్న ఆయనకు ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు.
Tamil Nadu: Prime Minister Narendra Modi receives Chinese President Xi Jinping at Mahabalipuram. pic.twitter.com/8FZ3Z9VvZT
— ANI (@ANI) October 11, 2019
అంతకుముందు మహాబలిపురంకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్ అపియరెన్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. తమిళ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ధోవతీ చొక్కా కండువాలను ధరించి వావ్ అనిపించారు ప్రధాని మోడీ. జిన్పింగ్కు స్వాగతం పలికిన అనంతరం ఇరుదేశాధినేతలు మహాబలిపురంలోని షోర్ ఆలయంలో కలియతిరిగారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత గురించి ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు వివరించారు. అర్జునుడు తాను పొందిన ఆయుధం గురించి వివరించారు. పలు శిల్పాలను ఎంతో ఆసక్తితో తిలకించారు జిన్పింగ్.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ఆయా దేశాల సంస్కృతులు చరిత్రలు తెలుసుకోవాలంటే చాలా ఆసక్తి చూపుతారట. ముఖ్యంగా ప్రపంచదేశాలు చైనాతో కలిగి ఉన్న ప్రాచీన సంబంధాల గురించి జిన్పింగ్ ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటారని అతని సన్నిహితులు చెబుతుంటారు. ఇందులో భాగంగానే మహాబలిపురం చైనాల మధ్య సంబంధం గురించి కూడా తెలుసుకున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం పల్లవరాజులు మహాబలిపురంలోని నౌకాశ్రయం నుంచి వస్తువులను చైనాకు రవాణా చేస్తూ ఆదేశంతో వాణిజ్య సంబంధాలు నెరిపినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే భారత ప్రభుత్వం కూడా ఈ అగ్రనేతల అనధికారిక సమావేశానికి మహాబలిపురంనే వేదికగా నిర్ణయించినట్లు సమాచారం.