అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు: ఏమన్నారంటే..?
అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి ఆ ప్రయాణాలు సులభతరం అయ్యేలా చూడాలంటూ ప్రధాని మోదీ అమెరికాకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం వ్యాక్సిన్ సర్టిఫికేట్ల గుర్తింపు ద్వారా పరస్పర అవగాహనకు రావాలని ప్రధాని మోదీ అన్నారు. బ్రిటన్కు వెళుతున్న భారతీయులు రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ వారిని క్వారంటైన్లో ఉంచడాన్ని భారత్ తప్పుపడుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కరోనా వల్ల ప్రపంచ దేశాలు ఆర్థికంగా నష్టపోయాయని ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రయాణాలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా సులభతరం చేయాలని ఈ మేరకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏర్పాటు చేసిన గ్లోబల్ కోవిడ్-19 సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు. మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడ అడుగుపెట్టారు.
గతేడాది తొలి వేవ్ సందర్భంగా ఇతరదేశాల నుంచి తమ దేశానికి వచ్చేవారిపై అమెరికా నిషేధం విధించింది. ఈ మేరకు అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. అయితే కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ వచ్చిన తర్వాత కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. భారత్ లాంటి దేశాలపై ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గత కొన్ని రోజులుగా భారత్లో ఇస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్పై అనుమానాలు వ్యక్తం చేసిన బ్రిటన్.. ఆ తర్వాత జారీ చేసిన రివైజ్డ్ గైడ్లైన్స్ ద్వారా ఆమోదం తెలిపింది. అయితే కోవిషీల్డ్ వేసుకున్న భారతీయులు బ్రిటన్లో అడుగుపెట్టగానే సర్టిఫికేట్ చూపిస్తున్నప్పటికీ వారిని క్వారంటైన్లో ఉంచుతున్నారు. అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్తో తమకు ఎలాంటి సమస్య లేదని అయితే జారీ చేసిన సర్టిఫికేట్ల మీదే అనుమానం ఉందంటూ అక్కడి అధికారులు చెప్పడాన్ని భారత్ తప్పుబట్టింది.
ఇక బుధవారం కోవిడ్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ... భారత్లో వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగితే ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని చెప్పారు. ఇందుకోసం ముడిసరుకు సరఫరా చేసే మార్కెట్లు సహకరించాలని కోరారు. ఏప్రిల్ నెల నుంచి భారత్ వ్యాక్సిన్లను ఎగుమతి చేయడం నిలిపివేసింది. ఆ సమయంలో భారత్లో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. దీంతో ఎగుమతి నిలిపివేసింది. కొత్త వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరుగుతుందని చెప్పిన ప్రధాని మోదీ.. వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని అన్నారు.
ఈ ఏడాది మొదట్లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు 95 దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేసినట్లు గుర్తు చేసిన ప్రధాని...సెకండ్ వేవ్లో భారత్ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారినవేళ ప్రపంచ దేశాలు అండగా నిలిచాయని చెప్పారు. ఆ కష్ట సమయంలో అండగా ఉండి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. ఇక భారత్లో వ్యాక్సినేషన్ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించినట్లు ప్రధాని వెల్లడించారు. తన 71వ జన్మదినం రోజున 2.5 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రధాని గుర్తు చేశారు. ఇప్పటికీ 20 కోట్లకు పైగా భారతీయులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని చెప్పారు.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ను నిర్వహిస్తోందని చెప్పారు. దేశంలోని ఆరోగ్యవ్యవస్థ ఇందుకోసం ఎంతో కష్టపడిందని చెప్పుకొచ్చిన ప్రధాని మోదీ.. ఇప్పటి వరకు 800 మిలియన్ డోసులను డెలివర్ చేసిందని వెల్లడించారు.