పిరికిపంద మోడీ: జవాన్ల బలిదానాలపై ఉమ్మివేత: చైనా ముందు తలవంచి.. సైన్యం వెనక్కి: రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ప్రదానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. ఘాటు పదాలతో చెలరేగిపోయారు. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చోటు చేసుకుంటోన్న పరిణామాల నేపథ్యంలో మోడీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీని ఓ పిరికిపందగా అభివర్ణించారు. చైనా ముందు మోకరిల్లారని, భారత భూభాగాన్ని డ్రాగన్ కంట్రీకి ధారాదాత్తం చేశారని మండిపడ్డారు. సరిహద్దుల వద్ద పహారా కాస్తూ, దేశ పరిరక్షణ విషయంలో ప్రాణాలను అర్పించిన జవాన్ల త్యాగాలపై ఉమ్మి వేశారని, ఘోరంగా అవమానించారని ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు.
గంగానదిలో ప్రియాంకా గాంధీ పుణ్యస్నానం..నుదుట తిలకం: పూలు కురిపించిన యోగి సర్కార్
శుక్రవారం ఆయన దేశ రాజధానిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో- పార్టీ సీనియర్ నేత రణ్దీప్ సింగ్ సుర్జేవాలాతో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నరేంద్ర మోడీ.. చైనా ముందు ఏ మాత్రం నిలవలేకపోయారని ధ్వజమెత్తారు. ఆ దేశం ముందు మోకరిల్లారని విమర్శించారు. జాతీయ భద్రత, దేశ భూభాగాన్ని, అమర జవాన్ల త్యాగాలను పణంగా పెట్టారని ఆరోపించారు. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించిన తరువాతే.. లఢక్ నుంచి బలగాలను ఉపసంహరించుకున్నారని అన్నారు. దీనికి మోడీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద అత్యంత వ్యూహాత్మక, సున్నిత ప్రాంతాలను మోడీ సర్కార్.. చైనాకు అప్పగించి, రాజీ పడిందని రాహుల్ గాంధీ అన్నారు. లఢక్ ఈశాన్య ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. పార్లమెంట్లో చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు. వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న పరిస్థితులకు భిన్నమైన ప్రకటన చేశారని విమర్శించారు. వాస్తవాధీన రేఖ వద్ద గల ఫింగర్-4 ప్రాంతం నుంచి బలగాలను ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఫింగర్-4 ప్రాంత భారత భూభాగమని గుర్తు చేశారు. ఫింగర్-4 నుంచి ఫింగర్-3 వరకు బలగాలను ఎందుకు వెనక్కి పంపించాల్సి వచ్చిందని అన్నారు.