False News:అందరికీ రూ.15000 ఇస్తున్న ప్రధాని..ఈ వార్తలో నిజమెంత ?
న్యూఢిల్లీ: కరోనావైరస్ పై సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూడా. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా వదంతులను నమ్మొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం సూచించిన విధానాలనే పాటించాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక తప్పుడు వార్తలపై కూడా ప్రభుత్వం నిఘా పెంచింది. అవాస్తవాలను అదే పనిగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం.
తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. ఈ మెసేజ్ హిందీలో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ రూ.15వేలు ఇస్తున్నారంటూ ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. అంతేకాదు దీనికి అనుబంధంగా ఒక లింక్ కూడా ఉంది. ఒక్కసారిగా ఆ లింక్ పై క్లిక్ చేస్తే నేరుగా ఓ సైట్ ఓపెన్ అవుతోంది. అక్కడ ఒక అప్లికేషన్ ఫారం ఉంటుంది.
అందులో పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్, పిన్కోడ్ లాంటి వివరాలను అడుగుతుంది. ఈ అప్లికేషన్ను పూర్తి చేస్తే నేరుగా 15000 వస్తాయనే సందేశం ఉంటుంది. అంతేకాదు ఆ అప్లికేషన్ ఫారం కింద దాదాపు లక్ష మంది ప్రజలకు రూ.15వేలు లభించిందంటూ ఉంది. pm15000rs.blogspot.com అనే లింక్పై ఇదంతా యాక్టివేట్ అయ్యింది.
అయితే ఇదంతా అవాస్తవం అని ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి ప్రకటన ప్రభుత్వం చేయలేదని స్పష్టం చేసింది. మే 3వరకు లాక్డౌన్ మాత్రమే పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారని అంతే తప్ప అందరికి రూ.15000 ఇస్తామని ఎక్కడా చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఈ వార్తలపై ఫ్యాక్ట్ చెక్ కూడా నిర్వహించడం జరిగింది. ఇదంతా ఒక లింక్ పై యాక్టివేట్ అయి ఉందని అది కూడా ఫేక్ అని తేలినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.