అణు పరీక్షలపై భారత్కు జపాన్ హెచ్చరిక! ముంబై టు అహ్మదాబాద్ 3 గంటల్లో!
న్యూఢిల్లీ: భారత్ అణు పరీక్షలకు వెళ్లినట్లయితే తమ రెండు దేశాల మధ్య కుదిరిన అణు ఇంధన సహకార ఒప్పందాన్ని సమీక్షిస్తామని, ఇది అత్యంత సహజమని జపాన్ స్పష్టం చేసింది. అయితే భారత్ అలాంటి ప్రయత్నాల్లో ఉన్నట్లుగా కనిపించడం లేదని జపాన్ ప్రభుత్వ పత్రికా వ్యవహారాలు, ప్రజా దౌత్య విభాగ డైరెక్టర్ జనరల్ యసుహిస కవముర చెప్పారు.
జపాన్ - భారత్ మధ్య అణుశక్తి, రక్షణ రంగాల సహకారాల పైన శనివారం కీలక ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే.
మూడు గంటల్లో ముంబై నుంచి అహ్మదాబాదుకు..
మొట్టమొదటి బులెట్ రైలు రాకతో దేశ వాణిజ్య రాజధాని ముంబై, గుజరాత్లోని అహ్మదాబాద్ల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోనుంది. ఈ మార్గంలో అధికవేగ రైళ్లను నడపడంలో సాధ్యాసాధ్యాలపై 2013 డిసెంబరులో మొదలైన అధ్యయనం ఈ ఏడాది జులైలో ముగిసింది.
ముంబై - అహ్మదాబాద్ నగరాల మధ్య దూరం 505 కి.మీ. ప్రస్తుత రైళ్లలో ప్రయాణ సమయం ఎనిమిది గంటల సమయం పడుతోంది. బులెట్ రైళ్ల వేగం గంటకు మూడు వందల నుంచి 350 కిలోమీటర్ల వరకు ఉందాయి. బులెట్ రైలు వచ్చాక ముంబై నుంచి అహ్మదాబాద్కు కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చు.
తద్వారా ప్రయాణ సమయం సగం ఆదా కానుంది. వాస్తవ పనులు మొదలైనప్పటి నుంచి ఏడేళ్లలో మొత్తం పని పూర్తవుతుంది. ముంబై - అహ్మదాబాద్ మధ్య అధికవేగ రైలును ప్రవేశపెట్టాలన్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, వేగం, విశ్వసనీయత, భద్రతలకు మారుపేరైన షింకన్సేన్ సాంకేతికతతో ఈ ప్రాజెక్టు చేపట్టడం ముదావహం అని ప్రధాని మోడీ అన్నారు.
రూ.98వేల కోట్ల రుణాన్ని, సాంకేతిక సాయాన్ని ఓ అసాధారణ ప్యాకేజి రూపంలో అందిస్తున్న జపాన్ ప్రధాని షింజో అబె అభినందనీయుడని, ఈ ప్రాజెక్టు భారతీయ రైల్వేలో విప్లవానికి శ్రీకారం చుడుతుందని, భవిష్యత్తు దిశగా భారత ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని మోడీ చెప్పారు.