ఫార్చూన్ శక్తిమంతుల జాబితాలో మోడీ, కైలాష్: ఒబామాకు దక్కని చోటు
న్యూయార్క్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థిలు ప్రపంచ శక్తిమంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫ్యార్చూన్ మేగజైన్-2015 సంవత్సరానికి గానూ 50 మందితో ఓ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో మోడీ, కైలాశ్లు ఉన్నారు.
ప్రధాని మోడీ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలవడగా, సత్యార్థి 28వ స్థానం దక్కించుకున్నారు. ఇదే జాబితాలో ఆపిల్ సంస్థ సిఈఓ టిమ్ కుక్ తొలి స్థానంలో నిలిచారు. భారత నేత(నరేంద్ర మోడీ) ఎన్నికల్లో ఇచ్చిన తన హామీలను అమలు చేయడం ప్రారంభించారని, ప్రపంచంలో భారత్ను అగ్రపథాన నిలిపేందుకు తనదైన కృషి చేస్తున్నారని ఫార్చూన్ పేర్కొంది.
నరేంద్ర మోడీ ప్రజా కాంక్షలను నెరవేరుస్తూ బిజినెస్ ఫ్రెండ్లీ విధానాలను అవలంభిస్తున్నారని తెలిపింది. మహిళలపై జరుగుతున్న నేరాలను కట్టడి చేయడంలో శ్రద్ధ చూపిస్తున్నారని, పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిస్తున్నారని పేర్కొంది. అంతేగాక, అమెరికాతోపాటు ఆసియా దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని వెల్లడించింది.
ఇక దేశీయంగా అంతర్జాతీయంగా కష్ట పరిస్థితులు ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వరుసగా రెండవసారి జాబితాలో చోటు దక్కించుకోలేకపోయినట్లు ఫార్చూన్ పేర్కొంది. కాగా, జాబితాలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు మారియో డ్రాగి రెండో స్థానం దక్కించుకున్నాడు.
చైనా అధ్యక్షుడు జింపింగ్ 3, పోప్ ఫ్రాన్సిస్ 4, జనరల్ మోటార్స్ సిఈఓ మేరీ బర్రా 9, స్టార్బక్ సిఈఓ హోవర్డ్ స్కాల్జ్ 17, బిల్ అండ్ మెలిందా గేట్స్ 18, ఫేస్బుక్ సిఈఓ మార్క్ జుకర్బర్గ్ 25, జెపి మోర్గాన్ సిఈఓ జామీ డిమన్ 38, ఉబెర్ సిఈఓ ట్రావిస్ కలానిక్ 44వ స్థానంలో ఉన్నారు.