‘నరేంద్ర మోడీ వారికి దేవుడు’: సోనియాపై మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలు
జైపూర్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఓ వైపు నిరసనలు, మరోవైపు ఆ చట్టానికి మద్దతు ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.
1987కు ముందు..: పౌరసత్వ సవరణపై చట్టంపై కేంద్రం స్పష్టత
మోడీ వారికి దేవుడే..
పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో హింసకు, వేధింపులకు గురై మనదేశంలోకి శరణార్థులుగా వచ్చిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ దేవుడిలా మారిపోయారని వ్యాఖ్యానించారు. శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించేందు కోసం కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
కొత్త జీవితాన్నిస్తున్నారు..
‘శరణార్థుల కోసం మోడీ దేవుడిలా వచ్చారు. పాకిస్థాన్లో తీవ్ర వివక్షను, హింసను ఎదుర్కొని మనదేశానికి ప్రాణభయంతో వచ్చారు శరణార్థలు. చచ్చినా తాము పాకిస్థాన్ వెళ్లే పరిస్థితి లేదని వారంటున్నారు. వారంతా ఒక కొత్త జీవితాన్ని ఇక్కడ పొందుతున్నారు' అని మీడియా సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు.
సోనియా అప్పుడేం చేశారు?
పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్లో ఆందోళనలను, అనుమానాలను రేకెత్తిస్తున్నారని శివరాజ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పౌరసత్వ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు మాట్లాడకుండా.. ఇప్పుడు వీడియో సందేశాలు పంపి ప్రజలను తప్పుదోబ పట్టిస్తున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీకి తెలుసా?
పార్లమెంటులో బిల్లుపై చర్చ జరిగిన సమయంలో సోనియా గాంధీ మాట్లాడవచ్చు కాదా.. ప్రశ్నించారు. భారతదేశంలో నివసించే వలసదారుల దయనీయ పరిస్థితి రాహుల్ గాంధీకి ఏమైనా తెలుసా? అంటూ నిలదీశారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో తీవ్ర వివక్షను, హింసను ఎదుర్కొని మనదేశంలోకి శరణార్థులుగా వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, తదితర మైనార్టీ వర్గాలకు మనదేశ పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. 2014 కంటే ముందు మనదేశంలోకి శరణార్థులుగా వచ్చిన వారికి ఈ చట్టం ద్వారా భారత సౌరసత్వం ఇస్తారు. ఈ చట్టం ద్వారా భారతదేశంలోని ఏ పౌరుడికి కూడా ఎలాంటి నష్టం లేదని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఏ భారతీయుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.