లాక్డౌన్ పొడగింపు: మోదీ మరో అడుగు.. నేడు సీఎంలతో భేటీ.. ఆర్థిక ప్యాకేజీ.. ‘షాక్’ తప్పదా?
మూడో దశ లాక్డౌన్ గడువు కూడా ముంచుకొస్తున్నా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఆదివారం నాటికి కొవిడ్-19 కేసుల సంఖ్య 64వేలకు చేరువకాగా, మరణాల సంఖ్య 2వేలు దాటింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని ప్రధాని కార్యాలయం(పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు, లాక్ డౌన్ కారణంగా చితికిపోయిన పేదలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ఆదుకునేందుకు మరో ఆర్థిక ప్యాకేజీని కూడా కేంద్రం సిద్ధం చేసింది. ఈ వారంలోనే వీటికి సంబందించిన కీలక ప్రకటనలు వెలవడనున్నాయి..
Recommended Video
11న ఐదో భేటీ..
దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ సడలింపులపై అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్ డౌన్ తర్వాత సీఎంలతో పీఎం కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఐదోసారి అవుతుంది. సోమవారమే(11న) ఈ కార్యక్రమం ఉంటుందని ప్రధాని కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీతోపాటు ఇంకా కంటేయిన్మెంట్ జోన్లుగా కొనసాగుతోన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్థిక కార్యాలపాల పున:ప్రారంభం తదితర అంశాలే కాన్ఫరెన్స్ లో ప్రధాన అజెండాగా ఉండొచ్చని కేంద్ర అధికారులు తెలిపారు.
మరిన్ని సడలింపులు..
కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రానికారణంగా లాక్ డౌన్ గడువును మరింతకాలం పెంచాలని కేంద్రం డిసైడైనట్లు సమాచారం. అయితే, మూడో దశ లాక్ డౌన్ ప్రకటన సందర్భంగా పలు రంగాలకు సడలింపులు కల్పించినట్లే.. రాబోయే రోజుల్లో మరిన్ని రంగాలకు, మరిన్ని సండలింపులు ప్రకటిస్తారని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా.. పలు రాష్ట్రాల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. మే 17 తర్వాత ఏఏ రంగాల్లో సడలింపులు ఇవ్వాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. మూడో దశ సడలింపులతో అన్ని రాష్ట్రాల్లో వైన్ షాపులు తెరుచుకోవడంతోపాటు, గ్రీన్ జోన్లలో పరిశ్రమలు పున:ప్రారంభం కావడం విదితమే. మరిన్ని సడలింపులు కల్పిస్తూనే, స్కూళ్లు, సినిమాహాళ్లు, పబ్లిక్ గ్యాదరింగ్స్ పై నిషేధం కొనసాగించే అవకాశమున్నట్లు తెలిసింది.
13న ప్యాకేజీ ప్రకటన..
కరోనా లాక్ డౌన్ సమయంలో పేదలను పూర్తిగా విస్మరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. మోదీ సర్కార్ మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనకు సిద్ధమైంది. లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టేలా మరో భారీ ప్యాకేజీని కేంద్రం సిద్ధం చేసిందని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉద్దీపన కల్పించే అంశాలెన్నో ఆ ప్యాకేజీలో ఉన్నాయని కేంద్ర అధికారులు వెల్లడించారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలోనే ఈ ఆర్థిక ప్యాకేజీ రూపొందిందని, బుధవారం నాటి కేంద్ర కేబినెట్ భేటీలో దానికి ఆమోదం తెలిపిన వెంటనే అధికారిక ప్రకటన వెలువడొచ్చని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
సీఎంల తిరుగుబాటు తప్పదా?
కరోనా ధాటికి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలినవేళ.. కేంద్రం చేపట్టిన విద్యుత్ చట్టాల సవరణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కేంద్రం రూపొందించిన ముసాయిదా చట్టం ప్రకారం.. విద్యుత్ కు సంబంధించి అధికారాలన్నీ కేంద్రానికి సంక్రమిస్తాయని, తద్వారా రాష్ట్రాలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతుందనే వాదన తెరపైకి వచ్చింది. కేంద్ర అధికారులు చెబుతున్నట్లు మంగళవారం గనుక సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే.. ఆ భేటీలో విద్యుత్ అంశం చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ విషయంలో కేంద్రానికి షాకిచ్చేందుకు కొందరు సీఎంలు ఇప్పటికే సిద్ధమైనట్లు తెలిసింది. వలస కూలీల తరలింపు వ్యవహారంలో ఇప్పటికే కేంద్రంపై పలువురు సీఎంలు బాహాటంగా విమర్శలు చేశారు. విద్యుత్ లొల్లి నేపథ్యంలో సీఎంలతో పీఎం భేటీ ఎలా జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది.