తొలి కాంగ్రెసేతర ప్రధాని: మరో రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో రికార్డును తన పేరున నమోదు చేసుకున్నారు. దేశంలో అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మోడీ రికార్డుల్లోకెక్కారు. గతంలో ఈ రికార్డు మాజీ ప్రధాని వాజ్పేయి మీద ఉండగా, తాజాగా దాన్ని ప్రధాని మోడీ అధిగమించారు.
వాజపేయి రికార్డును అధిగమించిన మోడీ..
ఇక ఎక్కువ కాలం ప్రధాని పనిచేసినవారిలో నరేంద్ర మోడీ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రసాదర భారతి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దివంగత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి 2268 రోజులు పదవిలో కొనసాగగా, ఈ గురువారంతో ప్రధాని నరేంద్ర మోడీ దాన్ని అధిగమించారు.
నరేంద్ర మోడీ 14వ ప్రధానిగా మే 26, 2014 ప్రమాణస్వీకారం చేశారు. రెండోసారి ప్రధానిగా మే 30, 2019న పదవీ బాధ్యతలు చేపట్టారు.
అత్యధిక కాలం పనిచేసింది కాంగ్రెస్ ప్రధానులే.. నెహ్రూ, ఇందిరా టాప్
కాగా, దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఎక్కువగా ఉండటం గమనార్హం. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అత్యధికంగా 17(16ఏళ్ల 286రోజులు) ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. ఆయన కుమార్తె ఇందిరా గాంధీ 11 ఏళ్ల 59 రోజులపాటు ప్రధానిగా ఉన్నారు. ఇక మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్లపాటు పనిచేశారు. ప్రధానిగా మోడీ ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. బీజేపీ రెండోసారి కూడా 303 సీట్ల భారీ మెజార్టీతో గెలిచింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ(నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్) కూటమి 353 స్థానాలను సాధించింది.
రామ జన్మభూమిని దర్శించిన తొలి ప్రధాని కూడా మోడీనే..
ప్రస్తుత రికార్డుతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మరో రికార్డును కూడా నమోదు చేశారు. అయోధ్యలోని రామ జన్మభూమిని దర్శించుకున్న మొట్ట మొదటి ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డులకెక్కారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ కంటే ముందు ప్రధాని హోదాలో ఇందిరా, రాజీవ్ గాంధ, వాజపేయిలు ప్రధాని హోదాలో అయోధ్యలో పర్యటించినప్పటికీ రామ జన్మభూమిని దర్శించుకోలేదు. ఆగస్టు 5న భూమిపూజను పురస్కరించుకుని మోడీ ప్రధాని హోదాలో రామ జన్మభూమిని దర్శించుకున్నారు. మార్చి 24న జాతినుద్దేశించిన ప్రధాని.. 21 రోజులపాటు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రసంగాన్ని టీవీల్లో అత్యధిక మంది వీక్షించారు. భారత టీవీ చరిత్రలో ఇదే రికార్డు కావడం గమనార్హం. ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతగా ప్రధాని మోడీ రికార్డు కెక్కిన విషయం తెలిసిందే.