ప్రధాని నరేంద్ర మోడీతో రతన్, ముకేష్ సహా పారిశ్రామికవేత్తలు: ఆర్థిక వ్యవస్థపై మేథోమథనం
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు ప్రధాని నరేంద్ర మోడీని సోమవారం కలిశారు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం మధ్యాహ్నం ప్రధాని కార్యాలయంలో వీరంతా సమావేశమై ఆర్థిక పరిస్థితిని పురోగమనం బాట పట్టించడంపై చర్చించారు.
కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతున్న వేళ దేశంలో కొత్త ఉద్యోగాలు కల్పించడం, దేశ జీడీపీని పురోగమన బాట పట్టించడం ఎలా అనే అంశాలపై కీలక మేథోమథనం జరిపారు. ఈ సమావేశానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్, ఆదానీ గ్రూప్ అధినేత గౌతమ్ ఆదానీతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
ఇది ఇలావుండగా, ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రానున్న దశాబ్ద కాలం వ్యాపారవేత్తలదేనని అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పెట్టుకున్న లక్ష్యం ఒక అడుగు మాత్రమేనని అన్నారు. పెద్ద లక్ష్యాల సాధన కోసం భారత ఆర్థిక వ్యవస్థకు రిస్కు తీసుకునే సామర్థ్యం ఉందన్నారు.
దేశంలో ఉన్న వ్యాపారవేత్తలకు వాళ్ల వ్యాపారాలను విభిన్న రంగాల్లోకి మరింతగా విస్తరించే సత్తా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఒక వ్యాపారవేత్తకు ప్రభుత్వం అండగా ఉంటే మరింతగా రాణించగలడని అన్నారు. జీఎస్టీ వంటి ఉత్తమ సంస్కరణలను మనదేశంలో తీసుకొచ్చామని ప్రధాని చెప్పారు. అంతేగాక, మనదేశంలో కార్పొరేట్ పన్నులు కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నారు.
కాగా, వచ్చే నెలలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ 4.5శాతంగా నమోదై ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టినప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రవేశపెట్టే బడ్జెట్ కీలకంగా మారింది.