ఏదో ఒకరోజు మోదీ తాజ్మహల్ను కూడా అమ్మేస్తాడు : రాహుల్ సెటైర్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ అన్నింటిని అమ్మేస్తున్నారని.. ఏదో ఒకరోజు మోదీ తాజ్మహల్ను కూడా అమ్మేస్తారని విమర్శించారు. మేకిన్ ఇండియా అంటూ మంచి నినాదం ఇచ్చారని... కానీ ఆచరణలో మాత్రం అదేమీ కనిపించడం లేదన్నారు.ఆగ్రాలో కొత్తగా ఇంతవరకు ఒక్క ఫ్యాక్టరీని కూడా నెలకొల్పలేకపోయారని ఆరోపించారు.
మోదీకి మతం పట్ల సరైన అవగాహన లేదన్న రాహుల్.. ఏ మత గ్రంథాలు హింసను ప్రస్తావించలేదన్నారు. కానీ బీజేపీ మాత్రం కేవలం హింసను వ్యాప్తి చేసేందుకే పనిచేస్తోందని ఆరోపించారు. అంతకుముందు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాహుల్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో నెలకొన్న నిరుద్యోగానికి పరిష్కారం చూపించడంపై బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు.
కాగా,బీజేపీ హయాంలో బీఎస్ఎన్ఎల్,ఎల్ఐసీ,రైల్వే,భారత్ పెట్రోలియం,ఎయిర్ ఇండియా.. ఇలా ఒక్కోదాన్ని ప్రైవేటీకరిస్తూ పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేట్ దారులకు విక్రయించడం సరికాదని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే జాతీయ బ్యాంకుల విలీనం పేరిట బ్యాంకింగ్ రంగాన్ని మోదీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసిందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్.. ఏదో ఒకరోజు మోదీ తాజ్మహల్ను కూడా అమ్మేస్తారంటూ సెటైర్స్ వేశారు.