గంగానది వద్ద క్లీనింగ్: మోడీ సవాల్కు సురేష్ రైనా సై
వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ రెండో రోజు వారణాసి పర్యటలో భాగంగా శనివారం ఉదయం గంగానది వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మొదటగా అస్పీఘాట్ అని పిలిచే దశాశ్వ మేథఘాట్ వద్ద గంగానదికి పూజలు చేసి హారతి ఇచ్చారు. ఆ తర్వాత పార చేతబట్టి ఘాట్లోని మట్టిని తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మరికొందరు స్థానికులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం స్వచ్ఛభారత్లో పాల్గొనాలంటూ మరో తొమ్మిది మందికి ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. వారిలో మొదటగా సమాజ్వాదిపార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్యాదవ్ను ఆహ్వానించడం ఆసక్తిని రేపింది. అఖిలేష్తో పాటు చిత్రకూటి యూనివర్సిటీ చాన్సలర్ స్వామిరామ్ భద్రాచార్య, ప్రముఖ బోజ్పురి నటుడు మనోజ్ తివారి, రచయిత మణిశర్మ, క్రికెటర్లు మహ్మద్ కేఫ్, సురేష్ రైనా, పద్మశ్రీ గ్రహీత ప్రొఫెసర్ దేవీప్రసాద్ ద్వివేది, ప్రముఖ టీవీ కమీడియన్ రాజ్శ్రీవాత్సవ, గాయకుడు కైలేష్ఖేర్లను ప్రధాని మోదీ నామినేట్ చేశారు.
నరేంద్ర మోడీ పిలుపును స్వీకరించిన క్రికెటర్ సురేష్రైనా వన్డే సిరీస్ తర్వాత స్వచ్ఛభారత్లో పాల్గొంటానని ట్విట్టర్లో వెల్లడించారు. ఘజియాబాద్లో జన్మించిన రైనా ఉత్తరప్రదేశ్కు అండర్ 16 ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, మొహమ్మద్ కైఫ్ అలహాబాద్కు చెందినవాడు. భారత్కు ప్రాతినిధ్యం వహించడానికి ముందు అతను ఉత్తరప్రదేశ్ తరఫున ఆడాడు. కైఫ్ కాంగ్రెసు టికెట్పై లోకసభకు పోటీ చేశాడు.
గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినప్పటి మాదిరిగానే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి తాను ఉత్తరప్రదేశ్ నుంచి 9 మందిని నామినేట్ చేస్తున్నట్లు మోడీ మీడియాతో చెప్పారు. ఈ కార్యక్రమం తర్వాత మోడీ శ్రీ ఆనందమయి ఆశ్రమానికి వెళ్లారు.