మోడీ అసలు హిందువే కాడు: రాహుల్పై వ్యాఖ్యలకు కౌంటర్
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెసు సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో సోమనాథ్ ఆలయంలో రాహుల్ గాంధీ హిందూయేతరుడిగా సంతకం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మోడీ నిజమైన హిందువు కారని కపిల్ సిబల్ అన్నారు.
ఆ ఆరోపణలకు విరుగుడుగా కపిల్ సిబల్ ఆ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హిందూయిజాన్ని వదిలేశారని, హిందుత్వాన్ని స్వీకరించారని కపిల్ సిబల్ అన్నారు. పీఎం ఎంత తరచుగా దేవాలయానికి వెళ్తారని ఆయన ప్రశ్నించారు. హిందుత్వానికి హిందూయిజంతో సంబంధం లేదని, ఆయన నిజమైన హిందువు కారని కపిల్ సిబల్ అన్నారు.
ప్రతి భారతీయుడిని తన సోదరునిగా, సోదరిగా, తల్లిగా భావించేవాడే నిజమైన హిందువని ఆయన గురువారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. బిజెపివాళ్లు హిందూ మతాన్ని వదిలేసి, హిందూత్వను ఆచరిస్తున్నారని ఆయన అన్నారు.
నోట్ల రద్దుపై లేదా జిఎస్టీపై బిజెపి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం లేదని, దాన్ని బట్టి రాజకీయాలు దిగజారాయని అర్థమవుతోందని ఆయన అన్నారు.
గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం వెళ్ళారు. సోమనాథ్ దేవాలయంలో ప్రవేశించేటపుడు హిందూయేతరులకు ఉద్దేశించిన రిజిస్టర్లో ఆయన పేరు రాశారనే వివాదం ప్రారంభమైంది.