డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా తొలగింపు: అత్యధిక ఫాలోవర్లు గల నేతగా ప్రధాని మోడీ అవతరణ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రియాశీల రాజకీయ నేతగా అవతరించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్లు కలిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ శాశ్వతంగా తొలగించడంతో ఇది సాధ్యమైంది. శుక్రవారం వందలాది ట్రంప్ మద్దతుదారులు కేపిటోల్ హిల్పై దాడి చేసిన నేపథ్యంలో ట్విట్టర్ ఈ చర్యకు ఉపక్రమించింది.
ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం 11న: వ్యాక్సినేషన్ పైనే ప్రధాన చర్చ!
ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం 64.7 మిలియన్ల ఫాలోవర్లను కలిగివున్నారు. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ 88.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం అత్యధిక ఫాలోవర్లు గల రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. ఆయనకు 127.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్కు 23.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక మనదేశ హోంమంత్రి అమిత్ షాకు 24.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు 21.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
రెండ్రోజుల క్రితం వాషింగ్టన్ డీసీలోని కేపిటోల్ హిల్పై వందలాది మంది ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ శాశ్వతంగా తొలగించింది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లను పరిశీలించిన అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది ట్విట్టర్ యాజమాన్యం.
అంతేగాక, ట్రంప్ నమ్మకస్తులైన మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైకేల్ ఫ్లిన్, అటార్నీ సిడ్నీ పావెల్ ఖాతాలను కూడా ట్విట్టర్ తొలగించింది. వీరు కూడా కుట్రకు పాల్పడ్డారని ఆరోపించింది. హింసను ప్రేరేపించే చర్యలకు పాల్పడితే శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. మంగళవారం ట్రంప్ అటార్నీ లిన్ వుడ్ ఖాతాను తొలగించింది.