నరేంద్ర మోడీ తులాభారం! గురువాయుర్ ఆలయంలో శ్రీకృష్ణ పరమాత్ముడి దర్శనం
తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం గురువాయుర్. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ఇక్కడ వెలిశాడని ప్రతీతి. కోరిన కోర్కెలు నెరవేరితే ఆ నల్లనయ్యకు తులాభారాన్ని సమర్పించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా అదే పని చేశారు. స్వామివారికి తులాభారాన్ని సమర్పించుకున్నారు. శనివారం ఉదయం న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన ఉదయం 9:20 నిమిషాలకు కేరళలోని త్రిసూర్కు చేరుకున్నారు. అక్కడి నుంచి నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లో 9:50 నిమిషాలకు గురువాయుర్ చేరుకున్నారు.
మలయాళీల సంప్రదాయ దుస్తుల్లో కనిపించారాయన. పట్టు పంచె కట్టుకుని, భుజంపై పట్టు ఉత్తరీయంతో ఆలయంలోనికి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ప్రధానిని సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆహ్వానించారు. సుమారు గంట పాటు మోడీ ఆలయంలోనే గడిపారు. ఈ సందర్భంగా స్వామి వారికి తులాభారాన్ని సమర్పించారు. ఆలయ పరిసరాల్లో కలియ తిరిగారు. ఉపాలయాలను సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గురువాయుర్ ఆలయం సందర్శన ముగిసిన అనంతరం ఆయన భారతీయ జనతాపార్టీ కేరళ శాఖ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీ కనీసం బోణీ కూడా చేయలేకపోయింది. అక్కడున్న 20 లోక్సభ స్థానాలన్నింటినీ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ గెలుచుకుంది. అధికారంలో ఉన్నప్పటికీ.. వామపక్షాలు కూడా ఒక్క లోక్సభ సీటును కూడా కైవసం చేసుకోలేకపోయాయి.
ఇద్దరూ అక్కడే..
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకే రాష్ట్రంలో బస చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన రాహుల్ గాంధీ.. ప్రస్తుతం అక్కడ పర్యటిస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం వాయనాడ్కు చేరుకున్నారు. అక్కడే బస చేశారు. ఆ మరుసటి రోజే నరేంద్ర మోడీ కూడా కేరళకే రావడం కాకతాళీయమేనని భావించవచ్చు.