బీహార్ ప్రజలు అభివృద్దికే ఓటు వేశారు... రికార్డు స్థాయిలో ఎన్డీయేకి ఓట్లు... : ప్రధాని మోదీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్దికే పట్టం కట్టారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 122 సీట్ల ఆధిక్యంలో ఉందన్నారు. ప్రజాస్వామ్యం ఎలా బలోపేతం అవుతుందో తాజా తీర్పుతో బీహార్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. రికార్డు స్థాయిలో పేదలు,అణగారిన వర్గాలు,మహిళలు బీజేపీకి ఓటు వేశారని చెప్పారు. ఈ మేరకు బిహార్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ వరుస ట్వీట్లు చేశారు.
Recommended Video
'బీహార్ పల్లెల్లోని రైతులు,కూలీలు,వ్యాపారులు,దుకాణదారులు... ఇలా ప్రతీ వర్గం ఎన్డీయే సబ్కా సాత్,సబ్కా వికాస్,సబ్కా విశ్వాస్ నినాదానికి ఓటేశారు. బీహార్లో ప్రతీ వ్యక్తి,ప్రతీ ప్రాంతం సమ అభివృద్ది కోసం మేము పూర్తి అంకితభావంతో పనిచేస్తూనే ఉంటామని మరోసారి భరోసా ఇస్తున్నాను.' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
'బీహార్ యువత చాలా స్పష్టమైన తీర్పునిచ్చారు. ఈ దశాబ్దంలో బీహార్ను స్వయం సమృద్ది దిశగా నడిపించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. బీజేపీ గతం కంటే మరింత ఎక్కువ పనిచేయాలని ఈ యువ శక్తి మమ్మల్ని ప్రోత్సహించింది. తాజా తీర్పుతో బీహార్లోని ప్రతీ ఓటరు అభివృద్దే తమ ఆకాంక్ష అని చాటి చెప్పారు. 15 ఏళ్ల తర్వాత బిహార్లో మళ్లీ ఎన్డీయే పరిపాలనలో బీహారీల కలలు నెరవేరుతున్నాయి.' అని మోదీ చెప్పుకొచ్చారు.
ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం.. బీహార్లో ఎన్డీయే కూటమి 124 స్థానాల్లో మహాకూటమి 111 స్థానాల్లో విజయం సాధించింది. లోక్ జనశక్తి పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. హోరాహోరీగా సాగిన పోరులో మొదటినుంచి దోబూచులాడుతూ వచ్చిన ఆధిపత్యం చివరకు బీజేపీనే వరించింది. ఈసీ ఇంకా అధికారికంగ ప్రకటించినప్పటికీ... ఎన్డీయే గెలుపు ఇక లాంఛనమే కావడంతో... మరోసారి నితీశ్ కుమారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.