ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ కీలక భేటీ: 11న మరోసారి వీడియో కాన్ఫరెన్స్: లాక్డౌన్పై తేలేది అప్పుడే
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను ముగియడానికి విధించిన గడువు సమీపించింది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే మంగళవారం నాటికి లాక్డౌన్ ముగియబోతోంది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ను కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. కరోనా వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి లాక్డౌన్ను కొనసాగించాల్సిందేనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
Recommended Video
శనివారం మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్
ఇలాంటి వాతావరణంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 11వ తేదీన శనివారం మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. లాక్డౌన్ ముగియడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఆయన ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ సహా దాదాపు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ను పొడిగించాలంటూ విజ్ఙప్తి చేసిన వేళ.. వారి సూచనలకు అనుకూలంగా మోడీ మొగ్గు చూపుతారని అంటున్నారు.
ఆ సంఘటనే లేకపోయి ఉంటే..
దేశంలో కరోనా వ్యప్తి చెందడాన్ని నివారించడానికి నరేంద్ర మోడీ 21 రోజుల లాక్డౌన్ను ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని దాదాపు అరికట్టగలిగామనే అభిప్రాయాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని మర్కజ్ మసీదులో తబ్లిగి జమాత్ పేరుతో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య కొద్దిగా పెరిగిందని, ఆ సంఘటనే చోటు చేసుకోకపోయి ఉంటే ఈ పాటికి కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి దాదాపు అడ్డుకట్ట పడి ఉండేదని చెబుతున్నారు.
పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున..
విదేశాల నుంచి స్వస్థలానికి చేరుకున్న వారి వల్ల వ్యాప్తి చెందిన పాజిటివ్ కేసులు ఒక ఎత్తయితే.. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి వల్ల సంక్రమించిన కేసులను మరో ఎత్తుగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కారణాలు ఏమైనప్పటికీ.. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని, ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ను ఎత్తేయాల్సి వస్తే.. మరింత వేగంగా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని భావిస్తోంది. అదే జరిగితే- ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రయత్నాలన్నీ వృధా అవుతాయనే ఆందోళన కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోందని అంటున్నారు.
ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతే..
లాక్డౌన్ పొడిగించాలా? వద్దా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోబోదని, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల అభిప్రాయాలను తెలుసుకుంటోందని, మెజారిటీ రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం గౌరవిస్తుందంటూ కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించిన మరుసటి రోజే.. ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించబోతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ముఖ్యమంత్రుల అభిప్రాయాలను స్వీకరించిన అనంతరం మోడీ లాక్డౌన్పై తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు.