మోడీ ఆరేళ్లలో ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప ఏమీ చేయలేదు: మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. దేశంలోని యువత, రైతులకు ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. శనివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన 'భారత్ బచావో' ర్యాలీలో మన్మోహన్ సింగ్ మాట్లాడారు.
గత ఆరేళ్ల మోడీ పాలనలో ప్రజలను తప్పుదోవ పట్టించడం ఒక్కటే చేశారని ద్వజమెత్తారు. ఎన్నికల సమయంలో యువతకు ఉపాధి, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ద్వారా జీడీపీని మెరుగుపరుస్తామని మోడీ హామీ ఇచ్చారు కానీ.. అవేవీ నెరవేర్చలేదని మన్మోహన్ సింగ్ అన్నారు.
2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారని అన్నారు. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, ఏటా 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామన్నారని.. కానీ ఆ హామీలన్నీ నీటిమూటలేనని తేలిపోతున్నాయని మన్మోహన్ సింగ్ ఎద్దేవా చేశారు. మోడీ తన ఆరేళ్ల పాలనలో ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొని ప్రసంగించారు. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం పెరుగుదల, రైతు సమస్యలను ప్రస్తావిస్తూ కేంద్రం విమర్శలు గుప్పించారు.
ప్రియంక గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఉద్యోగ కల్పనలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రణాళిక లేని జీఎస్టీ వల్ల రైతులు, వ్యాపారవేత్తలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. మోడీ వల్లే కోట్లాది మంది ఉద్యోగాలు పోయాయని, ఉల్లి ధరలు కూడా ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగాయన్నారు.