మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన సమాధీ రాజ్ఘాట్ దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సమాధి విజయ్ ఘాట్ వద్ద కూడా నివాళులు అర్పించారు. జాతిపితకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీలు కూడా నివాళులు అర్పించారు. ఇక 150వ జయంతి సందర్భంగా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్లు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. మహాత్ముడి 150 జయంతి సందర్భంగా అక్కడ జరిగే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాదు భారత్ను బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా ఆయన ప్రకటిస్తారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా గాంధీ సంకల్ప యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం ఢిల్లీ షాలిమార్ బాగ్లో ఆయన ప్రసంగిస్తారు.
ప్రధాని మోడీ సబర్మతీ ఆశ్రమంను సాయంత్రం సందర్శిస్తారు. అక్కడే 10వేల మంది సర్పంచ్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గాంధీజీ కన్న కలలను తమ ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమంతో నెరవేర్చిందని... ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఉన్నాయని భారత్ ఇప్పుడు బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా ఆవిర్భవించిందని మోడీ ప్రకటిస్తారు. అంతేకాదు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ పై యుద్ధాన్ని ప్రకటించనున్నారు ప్రధాని మోడీ.
Delhi: Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi at Raj Ghat. #GandhiJayanti pic.twitter.com/cjhtAVgaZt
— ANI (@ANI) October 2, 2019
ఇక దేశవ్యాప్తంగా ప్రజలు మహాత్ముడిని స్మరించుకుంటున్నారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఆయా రాజకీయపార్టీలు తమ ప్రధాన కార్యాలయాల్లో జాతిపితకు నివాళులు అర్పించాయి. గాంధీజీ చూపిన అహింసా మార్గంలో అంతా నడవాలని ప్రతిజ్ఞ చేశాయి. అహింసే ఆయుధంగా గాంధీజీ తెల్లదొరలను దేశం నుంచి వెళ్లగొట్టారని పలువురు ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.