ఆ నలుగురు సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్... ఆ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఆరా...
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేళ క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం(మే 8) నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే,మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్,తమిళనాడు సీఎం స్టాలిన్,హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్లతో మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.
రాష్ట్రంలో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం మరో యాప్ను అభివృద్ది చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా మహారాష్ట్ర సీఎం కేంద్రానికి లేఖ రాసిన మరుసటిరోజే ప్రధాని ఆయనతో ఫోన్లో మాట్లాడటం గమనార్హం. ప్రస్తుతం ఉన్న కోవిన్ యాప్లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తుండటంతో మహారాష్ట్ర కోసం ప్రత్యేక యాప్ తయారీకి అనుమతినివ్వాల్సిందిగా కేంద్రానికి రాసిన లేఖలో ఉద్దవ్ పేర్కొన్నారు.తాజా ఫోన్ సంభాషణలో మహారాష్ట్రకు మరింత ఆక్సిజన్ సప్లై అవసరమని ఉద్దవ్ థాక్రే మోదీ దృష్టికి తీసుకెళ్లారు. త్వరితగతిన ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రధానితో సంభాషణ వివరాలను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్లో కరోనా నియంత్రణకు,అలాగే ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరాకు చేపట్టిన చర్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రధానికి వివరించారు. కరోనాపై పోరుకు రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా అండగా నిలబడుతుందని ప్రధాని భరోసా ఇచ్చినట్లుగా సీఎం ట్వీట్ చేశారు.
గత మూడు రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు,సమస్యల పరిష్కారంపై ఆయన వారితో చర్చిస్తున్నారు. ఇదే క్రమంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రధాని తీరుపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రధాని తాను చెప్పాలనుకున్నది చెప్పారు తప్పితే తాను చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదని హేమంత్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రధానితో విభేదించడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం... దానికి హేమంత్ పార్టీ వర్గాలు ఘాటుగా రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది.