వన్ నేషన్-వన్ ఎలక్షన్.. జమిలి ఎన్నికలు భారత్కు అవసరం... మోదీ కీలక వ్యాఖ్యలు...
దేశంలో జమిలి ఎన్నికల అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ప్రతీ కొన్ని నెలలకోసారి ఎన్నికలు జరగడం అభివృద్ది పనులపై ప్రభావం చూపిస్తోందని.. కాబట్టి 'ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు' దేశ ఆవశ్యకత అన్నారు. ప్రజలపై,జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విధానాలపై రాజకీయాలు ఆధిపత్యం ప్రదర్శిస్తే దేశం ప్రతికూల మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. గురువారం(నవంబర్ 26) ఆన్లైన్ వేదికగా జరిగిన ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ 80వ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు.
లోక్సభ,అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంచాయితీ ఎన్నికలకు ఒకే ఓటరు జాబితా ఉండాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రతీ ఎన్నికలకు ప్రత్యేక ఓటరు జాబితా రూపొందించడం వనరులను వృథా చేయడమేనన్నారు. జీఎస్టీ ద్వారా 'వన్ నేషన్ వన్ ట్యాక్స్' సాకారమైందని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. అలాగే విద్యుత్ రంగంలో 'వన్ నేషన్ వన్ గ్రిడ్' పాలసీని కూడా విజయవంతంగా అమలుచేశామన్నారు.ఇక ఇప్పుడు 'వన్ నేషన్ వన్ ఎలక్షన్'పై చర్చ జరుగుతోందని... ప్రజాస్వామిక పద్దతిలో దీన్ని కూడా తప్పక సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో ఎప్పుడూ ఎన్నికల వాతావరణం అభివృద్దికి ఆటంకం అని బీజేపీ మొదటినుంచి చెబుతోంది. మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడే ఈ అంశాన్ని తెర పైకి తీసుకొచ్చారు. దీనిపై లా కమిషన్,నీతి ఆయోగ్ తమ నివేదికలను కూడా కేంద్రానికి సమర్పించాయి. లోక్సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని లా కమిషన్ సిఫారసు చేసింది. 2024 నుంచి లోక్సభ,అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. అయితే దేశంలోని రాజకీయ పార్టీలు ఇందుకు అంగీకారం చెబితేనే జమిలి ఎన్నికలు సాధ్యమవుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే స్పష్టం చేసింది.
One nation, one election isn't just a matter of debate, this is the need for India. Elections are held at different places every few months, the effect it has on development work is known to all. This issue needs to be studied & presiding officers can be guiding force for it: PM pic.twitter.com/rKAcrG9MKQ
— ANI (@ANI) November 26, 2020