కాంగ్రెస్కు ములాయం హెచ్చరిక, మెచ్చుకున్న మోడీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు కితాబిచ్చారు! పార్లమెంటుసమావేశాలను పదేపదే అడ్డుకోవడంపై కాంగ్రెస్ పార్టీకి ములాయం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
మంగళవారం నాడు బిజెపి పార్లమెంటరీ భేటీ అయింది. ఈ భేటీలో ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చేసిన హెచ్చరికల అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా మోడీ.. ములాయంకు కితాబిచ్చారు.
బిజెపి నేత, మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. పార్లమెంటు సమావేశాలు ముగింపు దశకు వచ్చాయని, ఇకనైనా ప్రజల సమస్యల పైన చర్చించాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారని తెలిపారు.
అదే సమయంలో ప్రధాని మోడీ... ములాయం సింగ్కు ధన్యవాదాలు చెప్పారన్నారు. కొంతమంది దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు పార్లమెంట్ను తప్పుదారి పట్టిస్తున్నారని మోడీ అన్నారు. అయితే సభలో నెలకొన్న ఆందోళనను తగ్గించేందుకు, సభా సజావుగా జరిగేందుకు ములాయం పరోక్షంగా మంచి పని చేశారని ప్రధాని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
కాగా, కాంగ్రెస్ పార్టీ సమావేశాలను అడ్డుకోవడంపై ములాయం సోమవారం ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సభను ఇలాగే అడ్డుకుంటే తాము మద్దతు ఉపసంహరించుకుంటామన్నారు. పార్లమెంటులో చర్చకు రావాల్సిన విలువైన అంశాలు వేదిక మీదకు రావడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిరంతర నిరసనను తాము ఖండిస్తున్నామని, సభ సాఫీగా సాగాలని చెప్పారు. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. విపక్షాలన్నింటితో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నామన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటన అబద్దమన్నారు.