శరద్ పవార్-సోనియా భేటీ నేపథ్యంలో ఎన్సీపీ ఎంపీలపై ప్రధాని ప్రశంసలు
న్యూఢిల్లీ: మరి కొద్ది గంటల్లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ కానున్న నేపథ్యంలో రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎన్సీపీ, బీజేడీ ఎంపీలు ఎంతో క్రమశిక్షణతో వ్యవహరిస్తారంటూ కితాబిచ్చారు. అర్థవంతమైన చర్చలో పాల్గొనడమే కాదు వారు చెప్పాల్సింది చాలా సూటిగా స్పష్టంగా చెబుతారంటూ ప్రశంసలు కురింపించారు. ఎప్పుడూ స్పీకర్ వెల్లోకి వచ్చి వారు ఆందోళనలు చేయలేదని మెచ్చుకున్నారు. ఎన్సీపీ ఎంపీల నుంచి తనతో పాటు ఇతర పార్టీల ఎంపీలు కూడా చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
రాజ్యసభలో 250వ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రసంగించిన ప్రధాని ఎన్సీపీ బీజేడీ ఎంపీల క్రమశిక్షణ గురించి ప్రస్తావించారు. వారిపై ప్రశంసలు కురిపించారు. అయితే ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కలవనున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ పార్టీలు అడుగులు ముందుకు వేస్తున్న క్రమంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక ప్రకటన వెలువడనుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివసేన బీజేపీలు పొత్తులో భాగంగా పోటీచేయగా ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పదవిపై రెండు పార్టీల మధ్య విబేధాలు తలెత్తాయి. ఇక అప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది. ఎవరూ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ సూచించారు.
PM Modi in Rajya Sabha: Today I want to appreciate two parties, NCP and BJD. These parties have strictly adhered to parliamentary norms. They have never gone into the well. Yet, they have raised their points very effectively. Other parties including mine can learn from them. pic.twitter.com/TXvUUOWJin
— ANI (@ANI) November 18, 2019
ఇక ఆ తర్వాత శివసేన పార్టీ ఎన్సీపీని కలవడం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్ భావించడంతో మహారాష్ట్రలో ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాయి. కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడుపుతామని శివసేన ఆత్మ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం మహారాష్ట్రలో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ చెప్పుకొచ్చారు.