మోడీ మెచ్చిన ఇంజనీరు: రూ. 42 లక్షల నకిలీ నోట్ల హీరో
భారత ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చిన ఇంజనీరు నేడు దొంగ నోట్ల వీరుడుగా చరిత్రకెక్కాడు. 2015లో ఇండియన్ కాంగ్రెస్ సభలో ప్రతిభ చూపించిన యువ ఇంజనీరు అభినవ్ వర్మను మోడీ ఎంతగానో ప్రశంసించారు.
మోహాలీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చిన ఇంజనీరు నేడు దొంగ నోట్ల వీరుడుగా చరిత్రకెక్కాడు. 2015లో ఇండియన్ కాంగ్రెస్ సభలో ప్రతిభ చూపించిన యువ ఇంజనీరు అభినవ్ వర్మను ప్రధాని నరేంద్ర మోడీ ఎంతగానో ప్రశంసించారు.
అయితే ప్రధాని మోడీ సర్కారు ఇటీవల దేశంలో కొత్తగా ప్రవేశ పెట్టిన 2,000 రుపాయల నకిలీ నోట్లు ముద్రించి వాటిని చలామణి చెయ్యడంతో యువ ఇంజనీరును పంజాబ్ లోని మొహాలీలో అరెస్టు చేశారు.
అభినవ్ వర్మతో పాటు అతని బంధువు విశాఖ వర్మ, లూథియానాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సుమన్ నాగపాల్ ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 42 లక్షల విలువైన దొంగ నోట్లు (రూ.2,000 నోట్లు ) స్వాధీనం చేసుకున్నారు.
అభినవ్ వర్మ తన అనుచరులతో కలిసి ప్రజలను సంప్రధించాడు. తరువాత వారి దగ్గర ఉన్న రూ.1,000, రూ.500 పాత నోట్లు తీసుకుని రూ. 2,000 నోట్లు (నకిలీ)ను 30 శాతం కమీషన్ పద్దతిలో ఇవ్వడం మొదలుపెట్టారు.
వీరు ఇస్తున్నది నకిలీ నోట్లు అని తెలియక ఇప్పటికే కొన్ని వందల మంది వీరి దగ్గర దొంగనోట్లు తీసుకుని మోసపోయారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే ఎంతమంది ఇలా మోసపోయారు అనే విషయం తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.
అభినవ్ వర్మతో పాటు ఈ ముగ్గురు వీవీఐపీలు మాత్రమే వాడాల్సిన ఎర్రబుగ్గతో అత్యాధునికైన సరికొత్త అడి ఎస్ యూవీలో వెలుతున్న సమయంలో పోలీసులకు అనుమానం వచ్చి కారు నిలిపి పరిశీలించగా విషయం వెలుగు చూసిందని మొహాలీ నగర పోలీసు కమీషనర్ పర్మీందర్ సింగ్ చెప్పారు.
అభినవ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. ఇతను అంధులు ఉపయోగించే స్టిక్స్ (కర్రలు)లో ఏర్పాటు చేయడానికి ఉపయోగపడే సెన్సర్లు తయారు చేశాడు. ఆ సెన్సర్ల సహాయంతో అంధులు కర్రకు ముందు ఏముందో తెలుసుకునే అవకాశం ఉంది.
రాళ్లు గానీ, గోతులు కానీ ఏమైనా అడ్డం వస్తే ఈ సెన్సర్లు గుర్తించి వెంటనే అలారం మోగిస్తుంది. ఆ ఆవిష్కరణ చేసినందుకు జాతీయ సైన్స్ కాంగ్రెస్ -2015 సభలో ప్రధాని నరేంద్ర మోడీ అభినవ్ వర్మను అభినందిచారు.
అయితే ఇప్పుడు చండీగఢ్ లోని అభినవ్ వర్మ తన కార్యాలయంలో సెన్సర్లు తయారు చెయ్యడం లేదని, రూ.2,000 నకిలీ నోట్లు తయారు చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అభినవ్ వర్మ ఎంత మొత్తంలో నకిలీ నోట్లు తయారు చేశాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.