జయంతి నటరాజన్ ఇష్యూ: మోడీపై విరుచుకుపడ్డ రాహుల్
న్యూఢిల్లీ: తమ పార్టీకి రాజీనామా చేస్తూ మాజీ కేంద్ర మంత్రి జయంతి నటరాజన్ చేసిన ఆరోపణలపై ఎట్టకేలకు కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిస్పందించారు. జయంతి నటరాజన్ విమర్శలపై ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన విరుచుకుపడ్డారు. జయంతి నటరాజన్ వ్యవహారంపై తొలిసారి ఢిల్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రతిస్పందించారు.
నిరుపేదల హక్కులను కాపాడడానికే తాను ఉన్నట్లు ఆయన తెలిపారు. తనపై దాడికి ప్రధాని నరేంద్ర మోడీ జయంతీ నటరాజన్ను నియమించారని, తాను గిరిజనుల కోసం పోరాటం చేశానని, ప్రాణాలు ఉన్నంత వరకు గిరిజనుల కోసం, పేదల కోసం పోరాటం చేస్తానని ఆయన అన్నారు.
తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి రాహుల్ గాంధీ కార్యాలయం వార్తాకథనాలను సృష్టించిందని జయంతీ నటరాజన్ గతవారం ఆరోపించిన విషయం తెలిసిందే. లోకసభ ఎన్నికల సందర్భంగా మోడీ చాలా వాగ్దానాలు చేశారని, ఒక్క వ్యక్తి భారత్ను మార్చలేరని రాహుల్ గాంధీ అన్నారు.
ధరల పెరుగుదల, నిరుద్యోగంపై కూడా రాహుల్ గాంధీ మోడీని తప్పు పట్టారు. మోడీ ప్రజలకు స్వప్నాలను విక్రయించారని, కానీ హామీలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు.