చైనాకు మరో షాక్: వైబో నుంచి తప్పుకున్న ప్రధాని మోడీ, జింపింగ్ ఫొటోలూ డిలీట్
న్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 యాప్లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ చైనా ప్రముఖ సోషల్ మీడియా యాప్ అయిన వైబో ఖాతా నుంచి తప్పుకున్నారు.
నిషేధం విధించిన 59 యాప్లలో వైబో కూడా ఉన్న నేపథ్యంలో ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక, వైబోలో ఇప్పటి వరకు చేసిన పోస్టులన్నింటినీ డిలీట్ చేశారు. చైనాకు చెందిన మరో ప్రముఖ సోషల్ మీడియా యాప్ వీచాట్లో భారత అధికారిక ప్రకటనలు, ప్రధాని మోడీ ప్రసంగాలను డ్రాగన్ దేశం తొలగించింది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చైనా యాప్ వైబో నుంచి వైదొలిగి ఆ దేశానికి మరో షాకిచ్చారు. 2015లో ప్రధాని మోడీ వైబోలో ఖాతా తెరిచారు. ఇందులో 115 పోస్టులు కూడా చేశారు. అయితే, వీఐపీ ఖాతాలను వైబోలో తొలగించడం కొంత కష్టమైన ప్రక్రియే. మొదట పోస్టులన్నీ తొలగించిన తర్వాత.. ఆ ఖాతా నుంచి వైదొలగాల్సి ఉంటుంది.
అయితే, చైనా అధ్యక్షుడితో ఉన్న రెండు ఫొటోలను తొలగించడం కొంత సమస్యగా మారింది. చివరకు ఆ ఫొటోలను కూడా తొలగించిన ప్రధాని మోడీ.. వైబో నుంచి నిష్క్రమించారు. దీంతో చైనాకు మరో షాకిచ్చినట్లయింది. మొత్తం 115 పోస్టులను మాన్యువల్గానే తొలగించారు. కాగా, వైబోలో మోడీకి 2,44,000 మంది ఫోలోవర్లు ఉన్నారు.
చైనాకు భారత్ స్నేహ హస్తం అందించినప్పటికీ.. డ్రాగన్ దేశం మాత్రం తన సామ్రాజ్య దురహంకారంతో సరిహద్దులో ఉద్రిక్తతలకు తెరలేపింది. జూన్ 15న దొంగదారిన భారత సైనికులపై దాడి చేసి 20 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. భారత జవాన్ల దాడిలో 45 మందికిపైగా చైనా సైనికులు కూడా హతమయ్యారు.