చారిత్రక ఘట్టానికి ప్రధాన సాక్షి: బెంగళూరుకు చేరుకున్న ప్రధాని మోడీ
బెంగళూరు: చారిత్రాత్మక ఘట్టం. దేశ అంతరిక్ష పరిశోధనలో చిరస్మరణీయ సందర్భం. ఇస్రో చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గ మహాద్భుత ఘటన మరి కొన్ని గంటల్లో సాక్షాత్కరించబోతోంది. చందమామ మన చేతికి అందడానికి ఇంకొన్ని నిమిషాలే మిగిలి ఉన్నాయి. ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయాణం చివరి దశకు చేరుకుంది. ఇందులో నుంచి విడివడిన విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని ముద్దాడటానికి పరుగులు తీస్తోంది. ఈ సుమూహూర్తం కోసం భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
జాబిల్లి దక్షిణ ధృవం వైపు అడుగు మోపడానికి దూసుకెళ్తోన్న విక్రమ్ ల్యాండర్.. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి చేరుకుంటుంది. ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా బెంగళూరుకు తరలివచ్చారు. ఈ ఉదయం వరకూ రష్యాలో అధికారిక పర్యటనలో తీరిక లేకుండా గడిపిన ఆయన ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు వచ్చారు. బెంగళూరు వైమానిక దళ విమానాశ్రయంలో కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా, ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్రమంత్రి సదానంద గౌడ, రాష్ట్రమంత్రి అశ్వర్థ నారాయణ తదితరులు ప్రధానికి సాదర స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రధానమంత్రి.. ఇస్రో కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుంటారు.
సమయం సమీపిస్తున్న కొద్దీ ఇస్రో కమాండ్ కంట్రోల్ రూమ్ వాతావరణం ఉద్విగ్నభరితంగా మారుతోంది. అపూర్వ ఘట్టంలో భాగస్వామ్యులైన శాస్త్రవేత్తల్లో తీవ్ర ఉత్కంఠతను చవి చూస్తున్నారు. చంద్రుడిపై అడుగు మోపడం అత్యంత క్లిష్టతరం. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని తాకే సమయంలో ఒక్క సెకెను తేడా వచ్చినా మొదటికే మోసం ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు శాస్త్రవేత్తలు. చందమామ ఉపరితలంపై పేరుకుపోయిన ధూళి వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ల్యాండ్ అయ్యే సమయంలో ధూళి అధికంగా చెలరేగితే.. పరికరాలు దెబ్బతింటాయనే సందేహాలు వారిని వెంటాడుతున్నాయి.