మీ రాజకీయాల కోసం ఆడుకోవద్దు: కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించిన ప్రధాని మోడీ
లక్నో: ఉత్తర ప్రదేశ్లో కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. యూపీలోని గోరఖ్పూర్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలి విడలో యూపీ, కర్ణాటక సహా 14 రాష్ట్రాల రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు జమ అవుతాయి. ఒక్కో రైతు ఖాతాలో ఏడాదికి రూ.6వేలు జమ చేయనున్న కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రూ.2వేలు, మిగతా రూ.4వేలు మరో రెండు విడతల్లో జమ చేయనుంది. రూ.75వేల కోట్లతో కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది.
కిసాన్ సమ్మాన్ నిధి ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ పథకంతో 21 రాష్ట్రాలలోని 1.1 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. గత పాలకులు రైతుల కష్టాలను పట్టించుకోలేదని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధి ప్రారంభిస్తుంటే కొందరు దీనిని రాజకీయం కోసం వాడుకోవాలని చూస్తున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ రాజకీయాల కోసం రైతుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. అలాగే తాను రైతులకు కూడా ఓ విజ్ఞప్తి చేస్తున్నానని, విపక్షాలు దీనిని రాజకీయం చేయాలని చూస్తున్నాయని, వారి వలలో పడవద్దని కోరారు. రుణమాఫీని అమలు చేయడం చాలా సులభమని, అందరికీ అది సులువుగా దొరికిందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.
రుణమాఫీ చేయడం మాకు కూడా సులువేనని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి కోసం మేం కూడా అలా చేయవచ్చునని చెప్పారు. కానీ తాము ఓట్ల కోసం అలాంటివి చేయమని చెప్పారు. అలాంటి క్రైమ్ తమ మనసు అంగీకరించదని చెప్పారు. ఎందుకంటే రుణమాఫీ కొందరికే సెలెక్టివ్గా జరుగుతుందని ఆరోపించారు.
కాగా, దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులు ఈ పథకం కిందికి వస్తారని కేంద్రం అంచనా వేసింది. ఈ పథకం ప్రారంభమైన వెంటనే కోటి మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో 2000 రూపాయలు జమ అవుతాయి. దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ పూర్తి చేసింది కేంద్రం. అర్హులైన రైతుల ఎంపిక కూడా పూర్తయింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పోర్టల్ ను కూడా ప్రారంభించింది.
అర్హులైన రైతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే ఈ పోర్టల్ ద్వారా కేంద్రానికి అందజేశాయి. వాటి ఆధారంగా కేంద్రం నిధులను బదిలీ చేయనుంది. తొలిదశలో కోటి మంది, మలి దశలో మిగిలిన రైతుల ఖాతాల్లో మరో వారం రోజుల్లోగా ఈ మొత్తం జమ అవుతుంది. గత ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి తెచ్చినట్టుగా కేంద్రం చూపిస్తోంది. అందుకే 2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన 2000 రూపాయల బకాయిలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు చెబుతోంది.