తెలుగు ప్రజలకు మోడీ ఉగాది శుభాకాంక్షలు, శ్రీశైలం ప్రస్తావన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు, కన్నడ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది యుగానికి ఆరంభమని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం రాత్రి వీడియో సమావేశం ద్వారా ఢిల్లీ నుంచి మోడీ కన్నడ, శివభక్తులకు సందేశం ఇచ్చారు.
తీపి, చేదు కలయికలతో కూడిన ఉగాది పచ్చడి మహా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. సరికొత్త ఆశలు, ఆశయాలతో ఉగాది ప్రారంభమవుతుందన్నారు. ఆయన తెలుగులోను మాట్లాడారు.
స్వామి, అమ్మవార్ల ఆశీర్వచనాలకు శ్రీశైలం దర్శించేవాడినని, సమయం లేక మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశం లేనందున టెక్నాలజీ సాయంతో మాట్లాడుతున్నానని చెప్పారు. రుషులు, ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కోటి వందనాలు అన్నారు.
జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం నభూతో నభవిష్యతి అన్నారు. అమ్మవారి శక్తిపీఠంతో పాటు ఇతర ఆధ్యాత్మిక పీఠాలెన్నో కొలువుదీరాయన్నారు. శ్రీశైలం.. బసవేశ్వరుడు నడయాడిన ప్రాంతం అన్నారు. సుప్రసిద్ధ అల్లం ప్రభుదేవ్, అక్కమహాదేవి ఇక్కడే ఈశ్వరుడిని దర్శించుకున్నారని, హేమరెడ్డి మల్లమ్మ మల్లయ్య భక్తురాలిగా ఇక్కడికి వచ్చి పేరుగాంచారన్నారు.
ప్రతి ఏడాది శ్రీశైలంలో ఉగాది పర్వదినాన ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారని, దైవ దర్శనం కోసం కర్నాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు కాలినడకన వస్తారని చెప్పారు. సంస్కృతి, ఆధ్యాత్మికతను కాపాడింది రుషులు, ప్రజలే అన్నారు.
మన పురాణ ఇతిహాసాల గురించి భవిష్యత్తు తరాలకు చేరకుండా స్వాతంత్య్రం వచ్చాక తొలి పాలకులు అడ్డుపడ్డారన్నారు. దేశంలోని దుష్టశక్తుల నుంచి రక్షణ, దిశానిర్దేశం సూచించేందుకు కుంభమేళా తరహా జనజాగృతి సమ్మేళనాలు జరుగుతున్నాయన్నారు.